ఆర్టీసీ బస్సెక్కాలంటే - మాస్కు ఉండాల్సిందే : ఖచ్చితంగా అమలు చేయాలంటూ..!!
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా వైరస్ తిరిగి విస్తరిస్తున్న వేళ..ప్రయాణీకుల ఆరోగ్య కోసం కఠిన నిర్ణయాలు అమలు చేయాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా... బస్సు ఎక్కాలంటే మాస్కు తప్పని సరి చేస్తూ నిబంధనల అమల్లోకి తెచ్చింది. తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనలు విధించింది. డ్రైవర్, కండక్టర్తో పాటు ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. బస్సులో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
సజ్జనార్ కీలక నిర్ణయం
కరోనాపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బస్టాండ్లో మైకుల ద్వారా ప్రకటిస్తుండాలని సజ్జనార్ సూచించారు. డిపోలకు వచ్చిన బస్సులను శుభ్రం చేస్తుండాలని ఆదేశించారు. బస్సుల్లో మాత్రమే కాకుండా బస్టాండ్ ఆవరణలోనూ ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, బస్టాండ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. రెండు వారాల క్రితం భాగ్యనగరంలో స్వల్పంగా ఉన్న కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. బహదూర్పల్లిలో ఓ యూనివర్సిటీలో 25 మంది విద్యార్థులు, అయిదుగురు ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడ్డారు.
పెరుగుతున్న వైరస్
తాజాగా బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓ టౌన్షిప్లో పది మందికి కరోనా సోకింది. మెల్లమెల్లగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల క్రితం 66 ఉన్న సంఖ్య ఈ నెల 3కు 82కు చేరింది. గాంధీ ఆస్పత్రిలో 35 మంది వరకు కొవిడ్తో చికిత్స పొందుతున్నారు. బ్లాక్ ఫంగస్తో మరో 16 మంది ఆస్పత్రిలో ఉన్నారు. ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చెందిన మూడు బ్రాంచ్లలో కొవిడ్, బ్లాక్ఫంగస్తో 70 మంది చికిత్స పొందుతున్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగా
మళ్లీ ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాలను ఒణికిస్తు ఒమిక్రాన్ కేసుల సంఖ్య ప్రస్తుతం మన దేశంలో అయిదుకు చేరింది. ఇప్పటికే కర్ణాటకలో రెండు..గుజరాత్ - మహారాష్ట్రలో ఒక్కో కేసు వెలుగులోకి రాగా.. ఈ రోజు ఢిల్లీలో ఒక కేసును గుర్తించారు. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో సైతం కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పని సరి చేసారు.