కారణమూ భూతమూ లేదు: బాబుపై తుమ్మల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన తెలంగాణ పర్యటనను తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్రంగా వ్యతిరేకించారు. కారణాలు లేకుండా చంద్రబాబు తెలంగాణ యాత్రను తలపెట్టారని ఆయన శనివారం మీడియాతో అన్నారు. తెలుగుదేశం తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారారా అని ఆయన ప్రశ్నించారు.
సచివాలయం తరలింపుపై కాంగ్రెసు పార్టీ చేపట్టిన ఆందోళనను ఆయన వ్యతిరేకించారు. పనిలేకనే కాంగ్రెసు పార్టీ పాదయాత్రలు చేస్తోందని ఆయన అన్నారు. సచివాలయం తరలింపుపై ఆందోళన సరి కాదని ఆయన అన్నారు. ప్రతిపక్షాలకు పని కల్పించుకుండా తాము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఆ అభివృద్ధిని చూసి ఒర్వలేకనే కాంగ్రెసు విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు.
లక్ష కోట్లరూపాయలు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీరివ్వని పెద్దమనిషి పాదయాత్ర చేస్తున్నారని ఆయన పొన్నాలను ఉద్దేశించి విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పొన్నాల లక్ష్మయ్య భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు.
సచివాలయ స్థలాన్ని రియల్ ఎస్టేట్కు వాడాల్సిన దౌర్బాగ్యం ప్రభుత్వానికి లేదన్నారు. చంద్రబాబు ఎక్కడైనా తిరగొచ్చు గానీ ఆయన పర్యటనకు కారణమూ...భూతమూ లేదన్నారు. గుదిబండ లాంటి ఈపీసీ తెలంగాణలో ఉండదన్నారు. అయిదువేల కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచామని తుమ్మల చెప్పారు.