టీవీ9 యాజమాన్యం వివాదం..! నిధుల మళ్లింపు అంశంలో రవిప్రకాష్పై ఫిర్యాదు..!!
హైదరాబాద్: ప్రముఖ మీడియా సంస్థ వివాదం కీలక మలుపు తిరుగుతోంది. టీవీ9 యాజమాన్యం వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. తన సంతకం రవిప్రకాష్ ఫోర్జరీ చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కొత్త డైరెక్టర్ల నియామకానికి రవి ప్రకాష్ అడ్డుతగులుతున్నారని కౌశిక్రావు ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ 9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. కౌశిక్ రావు ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు ఇప్పటికే రవి ప్రకాష్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే టీవీ 9 కార్యాలయంలోని కొన్ని కంప్యూటర్లను కూడా పరిశీలించినట్టు సమాచారం.
టీవీ9 సీఈవో రవిప్రకాష్ కోసం తెలంగాణ పోలీసుల వెతుకుతున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల నుంచి రవిప్రకాష్ కోసం గాలిస్తున్న పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని సమాచారం. టీవీ9 యాజమాన్యానికి తెలియకుండా నిధులు మళ్లించారని ఆరోపణలపై సైబర్ క్రైమ్ లో రవిప్రకాష్ పై కేసు నమోదైంది. రవిప్రకాష్ పై అలంద మీడియా ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా - రవిప్రకాష్ ఇంటితో పాటు టీవీ9 కార్యాలయంలోనూ పోలీసులు సోదాలు నిర్వహించడంతో పాటు ఆయన ఎక్కడ ఉన్నారనే అంశం పై ఆరా తీస్తున్నట్టు సమాచారం. అసలు అలంద మీడియాలో ఏమేరకు నిధుల మళ్లింపు జరిగిందో రవి ప్రకాశ్ అందుబాటులోకి వస్తేనే స్పష్టత వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.