భాగ్యనగరంలో ప్రపంచస్థాయి పోలీస్ ట్విన్ టవర్స్ ఇలా.. (పిక్చర్స్)
హైదరాబాద్: భాగ్యనగరం సహా రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నేరాలను నియంత్రిస్తూ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పకడ్బంధీ నిఘా వ్యవస్థ ఏర్పాటు లక్ష్యంతో హైదరాబాదులో అంతర్జాతీయస్థాయి భద్రత, నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా అనుసంధానం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష సీసీ కెమెరాలను, అన్ని జిల్లాల పోలీసు కార్యాలయాలను దీనికి అనుసంధానం చేయనున్నారు. జాతరలు, సభలు, సమావేశాలు, ఎక్కడెక్కడ ఏం జరిగినా ఇక్కడి నుంచే పర్యవేక్షించగలిగే సౌకర్యం దీనిలో కల్పించనున్నారు.
బంజారాహిల్స్లో నగర పోలీసు కమిషనరేటుకు కేటాయించిన ఎనిమిది ఎకరాల స్థలంలో దీనిని నిర్మించేందుకు సీఎం ఆమోదం తెలిపారు. భవన సముదాయ నమూనాను ఖరారు చేశారు. శనివారం తన నివాసంలో ఆయన ఈ భవన నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్మిశ్రా, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
భాగ్యనగరంలో పోలీస్ ట్విన్ టవర్స్
ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 ప్రముఖ కంపెనీలు ఇచ్చిన డిజైన్లను తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి కెసిఆర్ పరిశీలించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని.. రెండు టవర్ల అద్దాల భవనం నమూనాను ఆమోదించారు. ల్యాండ్స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్స్ మధ్య ఠీవిగా తలెత్తుకుని ఉండే ఈ జంట హర్మ్యాల సముదాయంలో ఒక టవర్ 16 అంతస్తులతో, మరొకటి 24 అంతస్తులతో ఉంటుంది. రెండు టవర్ల మధ్య వంతెన ఉంటుంది. టవర్లపై హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు. గ్రీన్ ఎనర్జీ కాన్సెప్ట్తో టవర్లపై సోలార్ రూఫ్, సందర్శకులకోసం భవనం కిందిభాగంలో ప్రత్యేక స్థలం ఉంటుంది.
భాగ్యనగరంలో పోలీస్ ట్విన్ టవర్స్
కనీసం 600 వాహనాలు పార్క్ చేసే వీలుంటుంది. సీసీసీ ప్రధాన హాలు నాలుగవ అంతస్తులో ఉంటుంది. నగరంలోని వివిధ కూడళ్లలోని సీసీ కెమెరాలను అనుసంధానించి ఉండే విశాలమైన వీడియో హాల్ ఏర్పాటు చేస్తారు. వెయ్యిమంది కూర్చొనేలా ఆడిటోరియం ఏర్పాటు చేయనున్నారు. భవనంలో ఇంకా ఏమేం ఉండాలో నిర్ణయించి, నమూనాకు తుది మెరుగులు దిద్దాలని అధికారుల బృందానికి కెసిఆర్ బాధ్యతలప్పగించారు.
భాగ్యనగరంలో పోలీస్ ట్విన్ టవర్స్
డిజైన్కు తుదిరూపం ఇచ్చి, టెండర్లు పిలిచి, నిర్మాణం ప్రారంభించాలన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఉండే సీసీసీ.. నగరంలోనూ, రాష్ట్రంలోనూ శాంతిభద్రతల పర్యవేక్షణకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నగరంలోని లక్ష సీసీ కెమెరాలు సీసీసీకి అనుసంధానమై ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పోలీసు ప్రధాన కార్యాలయాలను కూడా సీసీసీకి అనుసంధానం చేయాలని చెప్పారు. పుష్కరాలు, జాతరలువంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా కేవలం పోలీసులే కాకుండా ముఖ్యమంత్రి మొదలుకుని ప్రభుత్వ అధికారుల వరకు అక్కడి నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తారన్నారు.
భాగ్యనగరంలో పోలీస్ ట్విన్ టవర్స్
పోలీసులు వీధుల్లో ఎక్కువగా తిరుగకుండానే, అణువణువునా ఎక్కడ ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం సాధ్యమవుతుందన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసులు సీసీసీని సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరారు. ప్రజల ధన, మాన, ప్రాణరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. భవిష్యత్ హైదరాబాద్ అవసరాలకు తగినట్లుగా, స్మార్ట్ పోలీసింగ్ కోసం 4లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండే సీసీసీ దోహదపడుతుందన్నారు.