విషాదం: నీరు దొరక్క దప్పికతో ఇద్దరు చిన్నారులు మృతి, తల్లి పరిస్థితి విషమం
ఆదిలాబాద్: జిల్లాలోని చెన్నూరు మండలం ముద్దారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాగునీరు దొరక్క.. దప్పికతో ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
శనివారం లింగంపల్లి నుంచి ముద్దారంలో వివాహానికి వెళ్తుండగా ఇద్దరు పిల్లలు తాగేందుకు నీరు దొరక్క దాహంతో చనిపోయినట్లు తెలిసింది. పిల్లల దాహార్తిని తీర్చేందుకు వెళ్లిన తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పిల్లల మృతదేహాలను పశువుల కాపరి చూసి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో కరువు పరిస్థితులకు ఈ ఘటనలకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద చోటుచేసుకుంది. గొల్లపల్లి వద్ద రిశ్వంత్ అనే ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడు వర్థమాన్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు పిల్లలతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య
నల్గొండ జిల్లాలోని గుర్రంపూడు మండలం జూనూతుల గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. యాదమ్మ (29) అనే మహిళ తన ఇద్దరు పిల్లలు శ్వేత (7), ప్రణీత్ (6)లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
భర్త వెంకటయ్య మరో మహిళతో అక్రమ సంబంధం నెరపుతూ వరకట్న వేధింపులకు గురిచేస్తుండటంతోనే మనస్థాపంతో ఆమె తన ఇద్దరు పిల్లలను బావిలో పడేసి తాను బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications