తెలంగాణ ఉద్యమంలో శృతి, కార్పోరేట్ల రాష్ట్రం వచ్చిందని 'మావో'వైపు, ఎర్రబెల్లి ఆగ్రహం
వరంగల్: వరంగల్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇద్దరిలో... శృతి అనే యువతి ఉంది. ఆమె తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది. హన్మకొండ వడ్డేపల్లిలోని కుమ్మరివాడలో నివాసం ఉంటే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, విరసం సభ్యుడు సుదర్శన్ కూతురు శృతి అలియాస్ మహితి.
శృతి ఇంజినీరింగ్ పట్టభద్రురాలు. హైదరాబాదులో ఎంటెక్ చేస్తూ మావోయిస్టు కెకెడబ్ల్యూ (కరీంనగర్ - ఖమ్మం - వరంగల్) దళంలో చేరింది. సుదర్శన్, రమాదేవి దంపతులకు నలుగురు కూతుళ్లు. శృతి రెండో కూతురు. ఆమె చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేది.
సామాజిక సమస్యల పైన బాగా స్పందించేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోను ఆమె పాల్గొన్నదని తండ్రి సుదర్శన్ చెప్పారు. పదకొండు నెలల క్రితం నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేవని ఆయన చెప్పారు.
కార్పోరేట్ సంస్థలు, భూస్వాములకు కొమ్ముకాసే తెలంగాణ వచ్చిందని, ఇది నచ్చకనే శృతి మావోయిస్టుల్లోకి వెళ్లిపోయిందని ఆయన చెప్పారు.
ఇది బూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపించారు. పోలీసులు అడవులలో పట్టుకొని వారిని కాల్చి చంపారన్నారు. పట్టుబడిన వారిని కోర్టులో ప్రవేశ పెట్టాలని, ఇలా అయితే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేది ఎలా అని ప్రశ్నించారు.
ఎన్కౌంటర్ ఘటనపై ఎర్రబెల్లి స్పందన
ఎన్కౌంటర్ ఘటన పైన తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం స్పందించారు. మేడారం ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అన్నారు.
దీని పైన తమకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నక్సల్స్ అజెండాతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వారిని ఎన్కౌంటర్ చేయడం దారుణమన్నారు.