సిటీలో ఆగని దారుణాలు: బాలికపై క్యాబ్ డ్రైవర్, పెళ్లి పేరుతో యువతిపై ఈవెంట్ మేనేజర్ రేప్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ గ్యాంగ్రేప్ ఘటన మరువక ముందే నగరంలో మరో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఓ క్యాబ్ డ్రైవర్ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి యత్నించగా, మరో ఘటనలో ఓ ఈవెంట్ మేనేజర్.. ఓ యువతిపై పెళ్లి పేరుతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరి బాలికపై కన్నెసిన క్యాబ్ డ్రైవర్
మొదటి ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. షాహీన్నగర్కు చెందిన 12 ఏళ్ల బాలిక పాతబస్తీ సుల్తాన్షాహీలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకుంటోంది. మే 31న సాయంత్రం 6 గంటలకు ఇంట్లో చెప్పకుండా ఆమె షాహీన్ నగర్లోని తల్లిదండ్రుల వద్దకు బయల్దేరింది.
కాగా, పహడీషరీఫ్ కమాన్ దగ్గర ఒంటిరిగా ఉన్న బాలికను గమనించిన కిషన్బాగ్కు చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్ కలీం అలీ(36).. ఆమెను షాహీన్ బాగ్ కు తీసుకెళ్తానంటూ క్యాబ్లో ఎక్కించుకున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి రాత్రి 11 గంటల వరకు క్యాబ్లోనే తిప్పాడు.
రేప్ యత్నం.. బాలిక ప్రతిఘటించడంతో..
షాద్ నగర్ కొందుర్గ్లో డెయిరీఫాం నిర్వహిస్తున్న మిత్రుడు మహ్మద్ లుక్మాన్ అహ్మద్ అలియాస్ లుక్మాన్(34)కు ఫోన్ చేసి రప్పించాడు. ఇద్దరూ బాలికను కిడ్నాప్ చేసి కొందుర్గ్లోని లుక్మాన్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడే బాలికపై అత్యాచారానికి ప్రయత్నించారు. అయితే, బాలిక తీవ్రంగా ప్రతిఘటించి కేకలు వేయడంతో నిందితులు భయపడిపోయారు.
కలీం అలీ.. బాలికను క్యాబ్ లో ఎక్కించుకుని జూన్ 1న ఉదయం 5 గంటలకు సుల్తాన్ షాహీ ప్రాంతంలో వదిలివెళ్లిపోయాడు. మరోవైపు, బాలిక కనిపించడం లేదంటూ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు మొఘల్పుర పోలీసులు. ఆ బాలిక పోలీస్ స్టేషన్ ముందు నుంచి నడుస్తూ వెళ్లడం గమనించిన పోలీసులు.. ఆమెను భరోసా కేంద్రానికి తరలించారు. బాలిక ఫిర్యాదుతో ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, వారిని రిమాండ్కు తరలించారు.
పెళ్లి పేరుతో ఇంటికి తీసుకెళ్లి యువతిపై ఈవెంట్ మేనేజర్ రేప్
మరో ఘటనలో.. లంగర్హౌస్కు చెందిన మహ్మద్ సూఫియాన్(21) అనే ఈవెంట్ మేనేజర్.. చార్మినార్ సమీపంలోని క్లాత్ స్టోర్లో పనిచేస్తున్న బాలికతో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మే 30న రాత్రి అతడు బాలికను లంగర్హౌస్లోని ఇంటికి తీసుకెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ తర్వాతి రోజు ఆమెను ఆమె పనిచేస్తున్న షాపు వద్ద వదిలేశాడు. గురువారం తీవ్రమైన కడుపునొప్పితో యువతి బాధపడటం గుర్తించిన ఆమె తల్లి.. ఏమైందని ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కాలాపత్తర్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.