వైద్య సిబ్బంది నిర్లక్ష్యం: ఇంక్యుబేటర్లో వేడికి పసికందులకు గాయాలు, మృతి, ఆస్పత్రిపై దాడి
హైదరాబాద్: వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఇద్దరు పసికందుల ప్రాణం పోయింది. హైదరాబాద్ ఫలక్నుమాలోని కేఏఎం అనే ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంక్యుబేటర్లో పెట్టిన ఇద్దరు శిశువులను సమయానికి తీయడం మర్చిపోయారు సిబ్బంది. దీంతో తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు ఇద్దరు శిశువులు.
వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలోని కేఏఎం ఆస్పత్రిలో మంగళవారం రెండు డెలివరీలు జరిగాయి. డెలివరీ తర్వాత పిల్లులు ఆరోగ్యంగా ఉన్నారని బంధువులకు సమాచారం ఇచ్చారు వైద్యులు. వేడి కోసం శిశువులను ఇంక్యుబేటర్లో ఉంచామని తెలిపారు. అయితే, కొంతసేపటి తర్వాత పసికందుల ఆరోగ్యం క్షీణించిందన్నారు. ఛాతీపై గాయలపాలైన ఇద్దరు పిల్లలను వారి కుటుంబసభ్యులు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే, అప్పటికే ఇద్దరు శిశువులు కూడా మరణించారని అక్కడి వైద్యులు నిర్దారించారు. ఇద్దరు చిన్నారుల ఛాతీ, పొట్ట భాగాల్లో కాలినగాయాలున్నాయి. ఆ భాగాల్లో ఛర్మం కూడా ఊడింది. పుట్టినప్పుడు ఎలాంటి గాయాలు లేవని.. ఇంక్యుబేటర్ నుంచి బయటికి తీసిన తర్వాతే చిన్నారులకు గాయాలున్నాయని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇంక్యుబేటర్లోనే వేడి ఎక్కువై ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే గాయాలపాలై తమ చిన్నారులు మరణించారని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఇద్దరు చిన్నారుల మరణంతో తీవ్ర ఆగ్రహానికి గురైన బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు బుధవారం కేఏఎం ఆస్పత్రిపై దాడి చేశారు. ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.