భూగర్భంలోనూ కరోనా వైరస్ వ్యాప్తి.. ‘మర్కజ్’ తర్వాత మైనర్లు గజగజ..
'బ్రేక్ ద చైన్' అనేది కరోనా వ్యతిరేక పోరాటానికి ట్యాగ్ లైన్. చైన్ బ్రేక్ కావడానికి ముందు అసలు లీడ్ ఎక్కడుందో కనిపెట్టడం కూడా చికిత్సలో ముఖ్యాంశమవుతుంది. వైరస్ ఎక్కణ్నుంచి వ్యాప్తి చెందిందో తెల్సుకోగలిగితే.. రోగుల్ని ఈజీగా గుర్తించే వీలవుతుంది. వైరస్ విస్పోటనం చెందే చోటును ఎపిసెంటర్ గా భావిస్తే.. ఇండియాలో ప్రస్తుతానికి బయటపడ్డ అతి పెద్ద ఎపిసెంటరే 'మర్కజ్ భవన్'. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని ఈ మసీదు సముదాయం నుంచి కొన్ని వేల మందికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లొచ్చినవారిలో ఆరుగురు చనిపోవడం, సింగరేణి బొగ్గుగని కార్మికులు వైరస్ బారినపడటం కలకలం రేపుతున్నది.
పెరిగిన భయం..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, అత్యవసర సేవల కిందికొచ్చే విద్యుత్, బొగ్గు ఉత్పత్తికి మాత్రం ప్రభుత్వాలు మినహాయింపులిచ్చాయి. దీంతో తెలంగాణలో 30 భూగర్భ గనులు, 19 ఓపెన్ కాస్టులున్న సింగరేణి యధావిధిగా పనిచేస్తున్నది. సంస్థలో దాదాపు 49వేల కార్మికులుండగా, ప్రతిరోజూ 50 శాతానికిపైగా హాజరు నమోదవుతున్నది. కరోనా కేసుల సంక్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయమై యాజమాన్యానికి రిప్రెజెంటేష్లు కూడా ఇచ్చారు. తాజాగా ‘మర్కజ్ భవన్' వెళ్లొచ్చిన సింగరేణి కార్మికులిద్దరు వైరస్ బారినపడటం భయాలను రెట్టింపు చేసింది.
అక్కడ వ్యాప్తిని అరికట్టలేం..
ఉపరితలం నుంచి కొన్ని వేల అడుగులు లోపల.. ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసే కార్మికులకు నిరంతరం బయటి నుంచి గాలి(ఆక్సిజన్) సరఫరా చేస్తుంటారు. భూగర్భంలోనూ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముందని, వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి బయట అందరూ పాటించే ‘సోషల్ డిస్టెన్స్' పద్ధతిని గనిలో కుదరనేకుదరదని, ఒక్కో షిఫ్టులో ఒకేసారి వందల మంది కార్మికులు పని ప్రదేశంలో ఉంటారని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగానైనా బొగ్గు బావుల్ని మూసేయడం మంచిదని దాదాపు అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాశాయి.
వాళ్లు డ్యూటీలకు వెళ్లారా?
ఢిల్లీ ‘మర్కజ్' మత సమావేశానికి వెళ్లిన వారిలో.. ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వాళ్లలాడే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్లలో ఇద్దరు సింగరేణి కార్మికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిని వెంటనే బెల్లంపల్లిలోని ఐసోలేషన్ సెంటర్కు తరలించారు. ఆ ఇద్దరూ భూగర్భంలో పనిచేసేవారా? సర్ఫేస్ వర్కర్లా? అనేదానితోపాటు.. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత డ్యూటీలకు హాజరయ్యారా? ఎంతమందితో ఎక్కడెక్కడ కలిసి మాట్లాడారు? అనే విషయాలను కూడా పోలీసులు, అధికారులు ఆరాతీస్తున్నారు. బయటపడ్డ ఇద్దరు వ్యక్తులు కాకుండా సింగరేణికి సంబంధించిన ఇంకెవరైనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారా? అనే కోణంలోనూ అధికారులు జాగ్రత్త వహిస్తున్నారు. ఏది ఏమైనా ఉత్పత్తి మాత్రం నిలిపే అవకాశమే లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.
100 మిలియన్ టన్నుల నిల్వలు..
లాక్ డౌన్ తో దేశంలోని పరిశ్రమలు, వ్యాపారాలు, ఆఫీసులు, మాల్స్, థియేటర్స్, కమర్షియల్ సముదాయాలన్నీ మూతపడటంతో విద్యుత్ డిమాండ్ దారుణంగా పడిపోయింది. దీంతో బొగ్గు అమ్మకాలు తగ్గిపోయి.. నిల్వలు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ తర్వాత కూడా కోల్ ఇండియా పరిధిలో రోజుకు 2.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుండగా, గడిచిన 15 రోజుల్లో కేవలం 2 మిలియన్ టన్నులు మాత్రమే అమ్ముడుపోయినట్లు వెల్లడైంది. విద్యుత్ డిమాండ్ పడిపోవడంతో పవర్ ప్లాంట్స్ కూడా పూర్తిస్థాయి స్థామర్థ్యంతో పని చేయడంలేదు. ఇప్పటికిప్పుడు బొగ్గు రవాణా నిలిచిపోయినా నెల రోజుల ఉత్పత్తికి సరిపడా నిల్వలున్నాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తెలిపింది.
పెరుగుతోన్న కేసులు..
ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లొచ్చినవాళ్లతో తెలంగాణ, ఏపీలో కరోనా పాజిటివ్ ల సంఖ్య అమాంతం పెరిగింది. ఏపీలో 40కేసులు నమోదుకాగా, తెలంగాణలో 78కి పెరిగింది. రెండు రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొనడంతో ముఖ్యమంత్రులిద్దరూ తమ రాష్ట్రాల్లో హైలెవల్ మీటిగ్స్ ఏర్పాటు చేసి, క్రైసిస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యల్ని సూచించారు.