దారుణం: మైనర్ బాలికపై ఆరు నెలలపాటు అన్నదమ్ములు అత్యాచారం
వరంగల్: నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నదమ్ములిద్దరూ ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని ఆరు నెలలపాటు కొనసాగించడం గమనార్హం. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న బాలిక(15)ను ఆమె ఇంటి సమీపంలో ఉంటున్న అజ్మల్ అలీ(26), అబూ(22) బాలికకు మాయమాటలు చెప్పి గత ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో వరంగల్ ఏసీపీ గిరికుమార్, మిల్స్ కాలనీ సీఐ శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
అత్యాచార ఘటనపై సమాచారం అందుకున్న బాలిక బంధువులు, కుటుంబసభ్యులు నిందితుల ఇళ్లపై దాడి చేశారి వారి ఇంటి ముందున్న బైక్ లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత వరంగల్-నర్సంపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.