27 ఏళ్ల తర్వాత తల్లిని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చిన అరబ్ సిస్టర్స్
హైదరాబాద్: దాదాపు 27 ఏళ్ల తర్వాత తమ కన్నతల్లిని వెతుక్కుంటూ ఇద్దరు అమ్మాయిలు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి హైదరాబాద్ వచ్చారు. 29 ఏళ్ల అయేషా రషీద్, ఆమె 27 ఏళ్ల చెల్లె ఫాతిమా రషీద్ తమ కన్నతల్లి ఎవరో తెలియకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరాలో పెరిగారు. ఈ అక్కాచెల్లెళ్ల విషయంపై దక్కన్ క్రానికల్లో ఓ వార్తాకథనం వచ్చింది.
ఆ వార్తాకథనం ప్రకారం - ఫాతిమా రషీద్ పుట్టిన కొద్ది నెలలకే ఆ అక్కాచెల్లెళ్ల తండ్రి రషీద్ ఈద్ ఒబైద్ మాస్మెరీ హైదరాబాద్కు వారి తల్లి రజియా బేగంకు విడాకులు ఇచ్చి, భారత్కు పంపించేశాడు. మృత్యువు సమీపించిన నేపథ్యంలో దాదాపు 15 ఏళ్ల క్రితం తండ్రి వారికి కన్న తల్లి గురించి చెప్పాడు.
తల్లి హైదరాబాదులో ఉంటోందని, సాధ్యమైతే ఆమెను కలుసుకోవచ్చునని వారికి అతను చెప్పాడు. 27 ఏళ్ల క్రితం రషీద్ భార్యను హైదరాబాద్ పంపించేశాడు. దాంతో తల్లిని వెతుక్కుంటూ అక్కాచెల్లెళ్లు హైదరాబాద్ వచ్చారు. రజియా బేగం కోసం హైదరాబాదు సౌత్ జోన్ పోలీసుల సహకారంతో అక్కాచెల్లెళ్లు అన్వేషిస్తున్నారు.
తమ కన్నతల్లి గురించి తమ తండ్రి చెప్పిన వెంటనే హైదరాబాదు రాలేకపోయామని, ఎక్కడికి వెళ్లాలో ఎలా వెతకాలో తెలియక మిన్నకుండిపోయామని, తాము పెరిగి పెళ్లిళ్లు కూడా చేసుకున్నామని, తమ భర్తల సహకారంతో ఇక్కడికి వచ్చామని వారు చెబుతున్నారు.
ఆ అక్కాచెల్లెళ్లు తమ తల్లి ఫొటోతో అన్వేషణ ప్రారంభించారు. అయితే ఇప్పుడు వారి తల్లి రజియా 50 ఏళ్ల పడిలో పడింది. 1981లో రజియా బార్కాస్లో వివాహం చేసుకున్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఆమె తన భర్తతో ఏడేళ్లకు పైగా ఉండి, 1988లో హైదరాబాద్ తిరిగి వచ్చింది.
పోలీసులు బార్కాస్లో ఆమెకు సంబంధించిన కొంత సమాచారం సేకరించారు. తిరిగి వచ్చిన తర్వాత రజియా మరో పెళ్లి చేసుకుని ఉంటుందా అనే విషయంపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు.