హైదరాబాద్లో ఉబర్ బైక్ ట్యాక్సీలు: ప్రారంభించిన కేసీఆర్..
తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఉబర్ బైక్ ట్యాక్సీలను ప్రారంభించారు.
హైదరాబాద్: ప్రముఖ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సంస్థ ఉబర్ తమ సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే ఇన్నాళ్లు క్యాబ్ సర్వీసులు అందిస్తూ వస్తోన్న సంస్థ.. ఇకనుంచి ద్విచక్ర వాహనాల ద్వారా కూడా ట్యాక్సీలను అందుబాటులోకి తెస్తోంది.
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు ఉబర్ బైక్ ట్యాక్సీలను ప్రారంభించారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జెండా ఊపి ఈ బైక్ ట్యాక్సీల సేవలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, మహేందర్రెడ్డి, ఉబర్ సీఈవో ట్రావిస్ కానన్ తదితరులు పాల్గొన్నారు.
వ్యతిరేకిస్తున్న క్యాబ్ డ్రైవర్లు:
ఉబర్ సంస్థ బైక్ ట్యాక్సీలను ప్రవేశపెట్టడంతో అదే సంస్థకు చెందిన క్యాబ్ డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంగళవారం నాడు బైక్ ట్యాక్సీల సేవలను సంస్థ ప్రారంభించడంతో.. జూబ్లీహిల్స్ లోని సంస్థ కార్యాలయం వద్ద క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనకు దిగారు.
బైక్ ట్యాక్సీలతో తమకు తీరని నష్టం జరగుతుందని క్యాబ్ డ్రైవర్స్ వాపోతున్నారు. క్యాబ్ డ్రైవర్స్ ఆందోళనతో జూబ్లీహిల్స్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.