కంట్లో కారం కొట్టి దొంగను ఎత్తుకెళ్లారు
హైదరాబాద్: అఖీలుద్దీన్ అనే నిందితుడు పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. పోలీసు కస్టడీ నుంచి హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా పోలీసులపై దాడి చేసి అతను పరారయ్యాడు. ఈ సంఘటన హైదరాబాదు నగరంలో మంగళవారంనాడు చోటు చేసుకుంది.
ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్ వ్యవహారంలో పట్టుబడిన లంబా కేసులో అఖీలుద్దీన్ నిందితుడు. సోమవారం ఎల్బీ నగర్ పోలీసులు నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని జైలుకు తరలిస్తుండగా అతను పరారయ్యాడు.

అఖీల్ బంధువులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి వెంట ఉన్న పోలీసు కానిస్టేబుల్స్ శేఖర్, ఉపేందర్లపై కారం చల్లి అతన్ని తీసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. అఖిల్ సోదరుడు షకీల్ కూడా పలు మార్లు చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సంఘటనపై చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లారీ యజమానిని చంపిన డ్రైవర్
డబ్బుల విషయంలో గొడవ ఒకరి ప్రాణం తీసింది. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లు వద్ద ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ కుమార్ తన యజమాని గాలి సంపత్ రావు (35)తో వాగ్వాదానికి దిగాడు. తనకు డబ్బు ఎక్కువ ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు.
దాంతో ఆగకుండా లారీ డ్రైవర్ పక్కనే ఉన్న పార తీసుకుని లారీ యజమాని తలపై బలంగా మోదాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున మరణించాడు.












Click it and Unblock the Notifications