దావూద్ చీకటి ఒప్పందం: హైదరాబాద్ సెలబ్రిటీ హత్యకు సుపారీ? ఎవరతను?
Recommended Video
హైదరాబాద్: భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సెలబ్రిటీని చంపేందుకు చోటా షకీల్ తో భారీ డీల్ కూడా కుదుర్చుకున్నట్టు సమాచారం. అన్నీ సిద్దం చేసుకుని.. ఇక ఆ సెలబ్రిటీని లేపేసేందుకు సిద్దమైన దశలో.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు. ప్రస్తుతం వారి అదుపులో ఉన్న షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్ ఈ సంచలన విషయాలు వెల్లడించారు.
నసీం వెల్లడించిన సంచలనం:
గతేడాది నవంబర్లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు షార్ప్ షూటర్ నసీం అలియాస్ రిజ్వాన్ ను అరెస్టు చేశారు. ఢిల్లీ స్పెషల్ పోలీసులు ప్రస్తుతం అతన్నివిచారిస్తున్నారు. హైదరాబాదులోని సెలబ్రిటీని డీ-గ్యాంగ్ టార్గెట్ చేసిందన్న విషయాన్ని నసీం తాజా విచారణలో బయటపెట్టడం గమనార్హం.
చోటా షకీల్తో డీల్:
హైదరాబాద్కు చెందిన ఆ సెలబ్రిటీని హత్య చేసేందుకు దావూద్ నమ్మిన బంటు చోటా షకీల్తో రూ.45 లక్షల ఒప్పందం కుదిరిందని నసీం వెల్లడించాడు. అయితే ఈ ఆపరేషన్ సింగిల్ గా చేయవద్దని, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ మున్నా సింగ్తో కలసి చేయాలని చోటా షకీల్ ఆదేశించినట్టుగా నసీం వెల్లడించినట్టు తెలుస్తోంది.
ఇలా పట్టుబడ్డాడు..:
షకీల్ ఆదేశాల మేరకు మున్నా సింగ్ను కలిసేందుకు సిద్దమవుతుండగా.. నసీం ప్రధాన అనుచరుడు జునైద్ చౌదరి ఆ సమాచారాన్ని పోలీసులకు లీక్ చేశాడు. దీంతో పక్కా సమాచారంతో నసీంను ఢిల్లీ పోలీసులు గుర్గావ్ లో అరెస్టు చేశారు.
లిస్టులో చాలామంది:
హైదరాబాద్కు చెందిన సెలబ్రిటీతో పాటు పాక్ లో పుట్టి ఆ తర్వాత కెనడియన్గా మారిన రచయిత తారిఖ్ ఫథా, ‘కాఫీ విత్ డీ' సినిమా నిర్మాత, మరికొందరు సెలబ్రిటీలు, తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ తదితరులను చంపేందుకు 1.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం.
ఎవరా సెలబ్రిటీ?:
హైదరాబాద్ సెలబ్రిటీ అన్న విషయం వెల్లడైంది కానీ.. ఆ సెలబ్రిటీ ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. కనీసం ఏ రంగానికి చెందినవాడో అన్న క్లూ కూడా బయటకు రాలేదు. బహుశా సినీ రంగానికి చెందిన వ్యక్తే అయి ఉండవచ్చునన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ సెలబ్రిటీని చంపేంత అవసరం దావూద్ కు ఏమొచ్చిందనేది అంతుచిక్కని ప్రశ్న.