కాంగ్రెస్లో లొల్లి: 'దాసోజు శ్రవణ్కు టిక్కెట్ వద్దని తెరాస ఆదేశం', ఎల్పీ నగర్పై టీడీపీ పట్టు
హైదరాబాద్: మహాకూటమిలో, కూటమిలోని ఆయా పార్టీల్లో టిక్కెట్లు, సీట్ల గొడవ తారాస్థాయికి పెరుగుతోంది. సీనియర్లు, జూనియర్లు... ఇలా అందరూ టిక్కెట్ ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కూడా పలువురు నేతలు గాంధీ భవన్ వద్ద, తమ తమ నియోజకవర్గాల్లో ఆందోళనలు తెలిపారు. వరంగల్ జిల్లా అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డికి టిక్కెట్ పైన క్లారిటీ లేదని ఆయన అనుచరులు వరంగల్లో ఆందోళన వ్యక్తం చేశారు. వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షులు, స్థానిక నేతలు గ్రేటర్ వరంగల్ కార్యాలయంలో నిరాహార దీక్షకు దిగారు.
కాంగ్రెస్ ఆశావహుడు సురేందర్ రెడ్డి తన అనుచరులతో భేటీ అయ్యారు. తనకు టిక్కెట్ కేటాయించాలని చెప్పారు. లేదంటే తన అనుచరులు, అభిమానులు సూచనలు తీసుకొని నిర్ణయం తీసుంటానని హెచ్చరించారు. తనకు టిక్కెట్ ఇవ్వాలని, తన విజయం ఖాయమని, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. వడ్డెరలకు టిక్కెట్ కేటాయించాలని, స్థానిక నేత జే రాములుకు అవకాశమివ్వాలని పఠాన్చెరు కార్యకర్తలు గాంధీ భవన్ ఎదుట ఆందోళన చేశారు.

గాంధీ భవన్ ఎదుట ఆందోళనలు
వేములవాడ, పఠాన్చెరు, మల్కాజిగిరి, ఖానాపూర్, వరంగల్ వెస్ట్ సహా పలు నియోజకవర్గాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సీట్లను కూటమికి కేటాయిస్తే పార్టీకి నష్టమని హెచ్చరిస్తున్నారు. గాంధీ భవన్ ఎదుట ఆదివారం ఉదయం నుంచి పలువురు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఎల్బీ నగర్ టీడీపీకి ఇవ్వాల్సిందే
తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పలు సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. అందులో ఎల్బీ నగర్ కూడా ఉంది. దీనిని కాంగ్రెస్ పార్టీకి ఇవ్వవద్దని టీడీపీ ఆశావహులు సామ రంగారెడ్డి తన అనుచరులతో ఎన్టీఆర్ భవన్ వద్ద శనివారం ఆందోళనకు దిగారు. ఈ స్థానంలో గత ఎన్నికల్లో టీడీపీ నేత ఆర్ కృష్ణయ్య భారీ మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ కంటే 32వేల ఓట్లు ఎక్కువ
గత ఎన్నికల్లో ఏ పార్టీ గెలుచుకున్న స్థానాలను అదే పార్టీకి కేటాయిస్తామని మహాకూటమి పొత్తుల్లో భాగంగా తొలుత చెప్పారని సామ రంగారెడ్డి చెప్పారు. 2014 ఎన్నికల్లో ఎల్బీ నగర్ టీడీపీ విజయం సాధించగా మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్కు టీడీపీ కన్నా 32 వేల ఓట్లు తక్కువగా వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ను కాంగ్రెస్కు ఇస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు బయట ప్రచారం ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాగా, పార్టీ సీనియర్ నేతలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు వచ్చి సామ రంగారెడ్డికి నచ్చచెప్పారు. పొత్తుపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు. అయితే టీడీపీకి టిక్కెట్ ఇవ్వకుంటే తాను బరిలోకి దిగడం ఖాయమని చెప్పారు.

టిక్కెట్ల పంపిణీలో కేసీఆర్ కోవర్టులు
ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ పెద్దలు కేసీఆర్, కేటీఆర్లకు కోవర్టులుగా పని చేస్తున్నారని పీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను, ఓయు విద్యార్థులను వారే పక్కన పెడుతున్నారన్నారు. కేసీఆర్ ఎవరకి చెబితే వారికే పది నుంచి ఇరవై టిక్కెట్లు వచ్చే పరిస్థితి ఉందన్నారు. అధిష్టానానికి తప్పుడు ప్రచారం ఇస్తున్నారన్నారు.

దాసోజుకు టిక్కెట్ ఇవ్వొద్దని టీఆర్ఎస్ ఆదేశం
కేసీఆర్, తెరాసకు వ్యతిరేకంగా పోరాడిన తనకు, అద్దంకి దయాకర్కు, దాసోజు శ్రవణ్ కుమార్లకు టిక్కెట్లు ఇవ్వవద్దని తెరాస మార్గనిర్దేశనం చేసిందని, కాంగ్రెస్ పెద్దలు దానిని అనుసరిస్తున్నారని ఆరోపించారు. పలుచోట్ల డమ్మీ అభ్యర్థులను నిలిపే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఆ నాయకులకు తెరాస నేతలతో బిజినెస్ పరమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు. సాక్ష్యాలతో సహా వాటిని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. పార్టీలో ఓ సామాజిక వర్గానిదే ఆధిపత్యం అన్నారు.

టిక్కెట్లు అమ్ముకోలేదు
టిక్కెట్ల పంపిణీపై ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ స్పందించారు. జాబితాలో 25 మంది బీసీలకు చోటు కల్పించామని అన్నారు. మరో అయుదు స్థానాలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తాను ఎవరికీ టిక్కెట్లు అమ్ముకోలేదని చెప్పారు. తాను ఎవరి వద్దా డబ్బు తీసుకోలేదన్నారు. డబ్బులు ఇశ్తున్నామని ప్రచారం చేసే వారిపై ఈడీ, ఐటీ విచారణ చేపట్టాలన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో 40 మంది బీసీలకు టిక్కెట్లు ఇవ్వాలని ఆ సామాజిక వర్గం వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications