హైదరాబాద్లో కలకలం: కుక్క నోట్లో బాలుడి తల, పోలీసుల దర్యాప్తు
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వనస్థలిపురం పరిధిలో ఓ కుక్క నోట బాలుడి తల కనిపించడం కలకలం రేపింది. ఎల్బీనగర్ పరిధిలోని మన్సూరాబాద్ సహారా రోడ్డులో బాలుడి తలను ఓ కుక్క నోటకరుచుకుని వెళ్లడం చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కుక్కును వెంబడించారు. దీంతో బాలుడి తలను సహారా ప్రహారీగోడ సమీపంలోని పొదల్లో వదిలేసి కుక్క పారిపోయింది.
ఆ తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలోకి దింపారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం మన్సూరాబాద్ లోని సహారా రోడ్డులో ఓ కుక్క తన నోట ఓ బాలుడి తలను తీసుకెళుతుండటం గమనించిన స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
కొందరు స్థానికులు ఆ కుక్కను వెంబడించగా.. సహారా ప్రహారీగోడ సమీపంలోని పొదల్లో బాలుడి తలను వదిలేసి పారిపోయింది కుక్క. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత బాలుడి తలను స్వాధీనం చేసుకున్నారు. బాలుడి తలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి తలను కుక్క ఎక్కడ్నుంచి తెచ్చింది, అది ఎవరి తల అనేదానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాలుడిని ఎవరైనా హత్య చేశారా? లేక నరబలి చేశారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎవరైనా బాలుడు అదృశ్యమయ్యారా? అనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నారు.
ఒకరిని కాపాడబోయి ఒకరు.. చెరువులో పడి తాత, తండ్రి, మనవడు మృతి
వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. వరంగల్ నర్సంపేట మండలం చిన్నగురిజాలలో చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. చెరువులో మునిగిపోతున్న మనవడిని కాపాడేందుకు ప్రయత్నించి తాతా మనవడు అందులోనే మునిగిపోయారు. తన తండ్రి, కొడుకును కాపాడేందుకు విఫలయత్నం చేసిన బాలుడి తండ్రి కూడా అదే చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు క్షణాల్లోనే జలసమాధి కావడంతో రోదనలు మిన్నంటాయి. ఈ విషాద సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని చిన్నగురిజాల గ్రామంలో ఆదివారం జరిగింది.
Recommended Video
చిన్న గురిజాల గ్రామానికి చెందిన కృష్ణమూర్తి (65) అనే రైతు తన కొడుకు నాగరాజు (34), మనవడు దీపక్ (12) తో కలిసి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో మనవడు దీపక్ సరదాగా చెరువులో స్నానానికి దిగాడు. ఆ బాలుడు లోతు గమనించకుండా చెరువులో మునిగిపోవడంతో.. అతన్ని కాపాడేందుకు తాత కృష్ణమూర్తి చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు కృష్ణమూర్తి కూడా అందులోనే మునిగిపోయాడు. వారిద్దరూ చెరువులో మునిగి పోతుండడం గమనించిన బాలుడి తండ్రి నాగరాజు కూడా చెరువులోకి దూకాడు. చెరువులో మునిగిపోతున్న తన తండ్రి- కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నించిన నాగరాజు కూడా నీట మునిగి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.