స్త్రీ మృతదేహం లభ్యం: అత్యాచారం, ఆపై హత్య?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం ధారూర్ స్టేషన్ శివార్లలో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గుర్తుతెలియని మహిళపై అత్యాచారం జరిపి హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
దొంగల పట్టివేత
ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. దొంగల నుంచి రూ.23 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బంగారం పట్టివేత
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న 8 కిలోల బంగారాన్నికస్టమ్స్, డీఆర్ఐ అధికారులు పట్టకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని సోదా చేయగా బంగారం బయటపడినట్టు అధికారులు తెలిపారు.
వంతెనపై నుంచి పడి మహిళ మృతి
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన సోమవారంనాడు జరిగింది. జగిత్యాల మండలం అంబారిపేట గ్రామంలో మామిడికాయలు కోసేందుకు కొందరు మహిళలతో కలిసి నెల్లగొండ లక్ష్మి(40) బయలుదేరింది. మల్యాల మండలం నూకపల్లి వద్ద వీరంతా ఓ వంతెన దాటుతుండగా లక్ష్మి ప్రమాదవశాత్తు కిందకి పడిపోయింది. కాలువలో నీళ్లు లేకపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది.
మహిళ అనుమానాస్పద మృతి
నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. మహమ్మద్ నగర్లో ఓలెపు మంజులత అనే వివాహిత (28) తన ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటోంది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో మంచంపై ఆమె మృతదేహం కనిపించింది. అది గమనించి పోలీసులకు స్తానికులు సమాచారం అందించారు.
మంజుల మంచం పక్కనే మద్యం బాటిళ్లు, చికెన్, మటన్ ఉండడంతో ఆమె హత్యకు గురై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం రాత్రి మంజుల ఇంట్లో ఐదుగురు వ్యక్తులు ఉండడాన్ని చూశామని స్థానికులు అంటున్నారు.