ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధులు ఇవే.. : లోక్సభలో వెల్లడించిన కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
తెలంగాణ అప్పులు పెరిగాయి..
2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రమని చెప్పిన కేంద్రమంత్రి.. ఆ తర్వాత క్రమంగా రాష్ట్రం అప్పులు పెరిగాయన్నారు. తెలంగాణకు ఆరేళ్లలో పన్నుల వాటా కింద రూ. 85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ. 1289.04 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద రూ. 6,511 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
నిధులపై లిఖితపూర్వక సమాధానం..
వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ. 1,916 కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ. 3,853 కోట్లు తెలంగాణకు ఇచ్చినట్లు మంత్రి లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద రూ. 51,298.84 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ. 1500.54 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేసినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
వివక్షంటూ ఇప్పటికే కేసీఆర్ ఫైర్..
ఇది ఇలావుండగా, తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ ఇటీవల సీఎం కేసీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవని మండిపడ్డారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా నిష్పత్తిని తగ్గించడం దారుణమని అన్నారు. కేంద్రం భారీ కోతల కారణంగా రాష్ట్రంలో అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతానికి తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని వ్యాఖ్యానించారు.