సాయి గణేష్ కుటుంబసభ్యులకు కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్: అండగా ఉంటామని హామీ
న్యూఢిల్లీ: ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. మంత్రి పువ్వాడ అజయ్ ప్రోద్బలంతో పోలీసు అధికారులు తనపై 16 కేసులతోపాటు రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారని, ఆ వేధింపులు భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు సాయిగణేష్ మరణించే ముందు మీడియాకు తెలిపారు. దీంతో బీజేపీ నేతలు అధికార పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
సాయి గణేష్ కుటుంబానికి అమిత్ షా ఫోన్
కాగా, తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయ నాయకులు, పోలీసు అధికారి వేధింపులు భరించలేక ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబసభ్యులతో కేంద్రమంత్రి అమిత్ షా ఫోన్ మాట్లాడారు. సాయిగణేష్ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, కుటుంబసభ్యులను పరామర్శించారు.
సాయిగణేష్ కుటుంబానికి అండగా ఉంటామన్న అమిత్ షా
సాయిగణేష్ అమ్మమ్మ సావిత్రి, సోదరితో మాట్లాడి.. యువకుడి మృతిపై సంతాపం తెలిపారు. తమకు న్యాయం చేయాలని అమిత్ షాను సాయిగణేష్ కుటుంసభ్యులు కోరగా.. పార్టీ తరపున అండగా ఉంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న సాయి గణేష్ అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ అమిత్షా దృష్టికి తీసుకెళ్లారు ఖమ్మం బీజేపీ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి. ఈ కేసులో బాధితులకు అండగా ఉంటామని అమిత్షా హామీ ఇచ్చినట్టు పొంగులేటి సుధాకర్రెడ్డి తెలిపారు.
మంత్రి పువ్వాడ వేధింపులతోనే సాయి గణేష్ ఆత్మహత్య
మంత్రి పువ్వాడ అజయ్ ప్రోద్బలంతోనే పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల సమక్షంలోనే స్టేషన్లో పురుగు మందు తాగడంతో.. అపస్మారక స్థితిలో వెళ్లిపోయాడు. వెంటనే పోలీసులుప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మాట్లాడిన సాయి గణేష్.. తాను ఆత్మహత్య యత్నం చేయడానికి కారణాలను వివరించారు.
మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులతోనే పురుగుల మందు తాగినట్టు సాయిగణేష్ చెప్పాడు. మంత్రి ఆగడాలు ఎక్కవయ్యాయని... పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని తనను టార్చర్ పెట్టాడని వాపోయాడు. ఆ టార్చర్ తట్టుకోలేకే ఆత్మహత్య యత్నం చేశానన్నాడు. కాగా, ఆ తర్వాత, సాయి గణేష్ పరిస్థితి విషమంగా మారడంతో బీజేపీ నేతలు.. హైదరాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు.
సాయిగణేష్పై ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 కేసులు పెట్టారు పోలీసులు. అంతేగాక, పీడీ యాక్ట్ నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సాధారణంగా దోపిడీలు, హత్యలు చేసేవాళ్లు, పదే పదే నేరాలకు పాల్పడేవారిపై మాత్రమే.. పీడీ యాక్ట్, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. కానీ, బీజేపీ కార్యకర్త అయిన సాయిగణేష్పై పోలీసులు ఎందుకు ఇలాంటివి నమోదు చేశారన్నది వివాదంగా మారింది. ఇదంతా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రమేయంతోనే జరిగిందని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.