తెలంగాణ బీజేపీ బాస్ ఎంపికలో చంద్రబాబు ? తేల్చేసిన బండి సంజయ్..!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా సీనియర్ నేత రామచంద్రరావును ఇవాళ అధిష్టానం ఎంపిక చేసింది. బీసీల్లో ఎంతో మంది సీనియర్లున్నా కాదని రామచంద్రరావును ఎంపిక చేయడంపై సొంత పార్టీలో సైతం అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పొరుగు రాష్టం ఏపీ సీఎం చంద్రబాబు సూచన మేరకే బీజేపీ అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న చర్చ కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ ఛీప్ ఎంపికలో చంద్రబాబు పాత్రెంతో కేంద్రమంత్రి బండి సంజయ్ తేల్చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఇవాళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీపడొచ్చని ఆయన తెలిపారు. అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీలు కాదని విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
బండిసంజయ్ ఉన్నా.. లేకున్నా పార్టీ ఆగదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో రాజకీయ పోస్టులు పెడితే చర్యలు తప్పవని బండి హెచ్చరించారు.

Live from BJP State Office https://t.co/taDOGmUFql
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 30, 2025
అలాగే పొరుగు రాష్ట్రం ఏపీ సీఎం చంద్రబాబు సూచన మేరకే ఈటెల రాజేందర్ వంటి బీసీ నేతను కాదని అనూహ్యంగా రామచంద్రరావును ఎంపిక చేశారన్న చర్చపై బండి సంజయ్ స్పందిస్తూ.. ఆయన చెబితే అధ్యక్షుడిని ఎంపిక చేయరని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని బండి సంజయ్ తేల్చిచెప్పేశారు. ఇందులో మరో మాటకు తావులేదన్నారు. నామినేషన్ ఒక్కరే వేయాలా, ఎక్కువ మంది వేేయాలా అనేది ఎవరూ నిర్ణయించరని, బీజేపీ ప్రజాస్వామ్య పార్టీ అని బండి తెలిపారు. ఎంత మంది నామినేషన్ వేసినా అధిష్టానం నిర్ణయం ప్రకారమే అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు.
బీజేపీ అధ్యక్ష పదవి తనకు రావాలని ఎవరైనా కోరుకోవడంలో తప్పులేదని, అయితే ఎవరికి ఏ పదవి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. చంద్రబాబో, మరో నాయకుడో చెప్తే అధ్యక్షుడిని పార్టీ ఎంపిక చేయదన్నారు. బీజేపీ దేశంలో అధికారంలో ఉన్న పార్టీ అని గుర్తుచేశారు. సోషల్ మీడియాలోనో, బహిరంగంగానో పార్టీ నిర్ణయంపై విమర్శలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications