అగ్నిపథ్ కు కాంగ్రెస్ హయాంలోనే బీజం - రాజకీయం చేయద్దు : కిషన్ రెడ్డి..!!
దేశ వ్యాప్తంగా అగ్నిపత్ పైన కొనసాగుతున్న నిరసనలపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అగ్నిపథ్ పథకంపై అనవసరంగా రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయని.. అది మంచిది కాదని అన్నారు. అగ్నివీరులుగా ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కిషన్ రెడ్డి కోరారు. 1999లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 'అగ్నిపథ్'కు బీజం పడిందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
అప్పటి నుంచి ఈ పథకం అమలు పెండింగ్ లో ఉందని వివరించారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా అమలు కాలేదన్నారు. ఈ స్కీంతో దేశానికి మంచే తప్పా.. ఎవరికీ నష్టం జరగదని స్పష్టం చేశారు. సైన్యంలో పని చేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని..వారంతా అగ్నిపథ్ లో చేరవచ్చన్నారు. అగ్నివీరులకు సైన్యం నుంచి బయటికి వచ్చాక బిజినెస్, ఉద్యోగాల్లోనూ రాణించే అవకాశాలు దక్కుతాయని చెప్పుకొచ్చారు. మహీంద్ర లాంటి కంపెనీలు సైతం అగ్నివీరులందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయని వివరించారు.
అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయి. అగ్నిపథ్తో దేశానికి మంచి జరుగుతుంది, ఎవరికీ నష్టం లేదంటూ కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కేంద్రం అగ్నిపథ్ విషయంలో ముందకే వెళ్లాలని నిర్ణయించి..తొలి దశ నోటిఫికేషన్ జారీ చేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ పథకాన్ని నిరసిస్తూ..సత్యాగ్రహ నిర్వహించింది. దీని పైనే ప్రధాని సైతం బెంగుళూరులో పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. విపక్షాల తీరును తప్పుబట్టారు.