తెలంగాణలో అర్జెంటుగా ఆ నంబర్ పెంచాలన్న మోదీ... కేసీఆర్ రియాక్షన్ ఏంటి...?
కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ మంగళవారం(అగస్టు 11) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం ఇది ఏడోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి ముఖ్యమంత్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల గురించి ప్రస్తావిస్తూ... ఆ రాష్ట్రాల్లో అర్జెంటుగా టెస్టుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఇదే సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య గణనీయంగా పెంచామన్నారు.

కేసీఆర్ ఏమన్నారు...
కరోనా అనుభవాల దృష్ట్యా దేశంలో వైద్య సదుపాయాలపై ఎక్కువ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యుల సంఖ్యను పెంచడం, వైద్య కాలేజీల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి వైరస్లు ఎన్ని వచ్చినా తట్టుకునేలా వైద్య రంగాన్ని తీర్చిదిద్దాలని కేసీఆర్ చెప్పారు. ఇందుకు మోదీ చొరవ చూపాలని కోరారు. ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కరోనాపై కేసీఆర్ మాట్లాడారు.

టెస్టుల సంఖ్యను పెంచామన్న కేసీఆర్...
గతంలో కరోనా వైరస్ వ్యాప్తి వంటి అనుభవం భారత్కు లేనందునా... ఈ వైరస్ ఎంతకాలం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో అనేక వైరస్లు వచ్చి పోయినప్పటికీ... ఇలాంటి వైరస్ ప్రజల అనుభవంలో లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వ చర్యల గురించి వివరిస్తూ... రాష్ట్రంలో టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచామన్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉందని.. మరణాలు రేటు 0.7 శాతం ఉందని వెల్లడించారు. పడకల సంఖ్యను పెంచామని,అవసరమైన మందులు,సామాగ్రిని పెద్ద మొత్తంలో సిద్దంగా ఉంచుకున్నామని తెలిపారు.కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని... ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నామని కేసీఆర్ మోదీకి వివరించారు.
Recommended Video

అర్జెంటుగా టెస్టులు పెంచాలన్న మోదీ...
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రులతోనూ ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్లాక్ 3.0 నేపథ్యంలో దేశంలో పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆయన సీఎంలతో మాట్లాడారు. తెలంగాణ,బీహార్,గుజరాత్,పశ్చిమ బెంగాల్,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అర్జెంటుగా టెస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.దేశంలో ముఖ్యంగా 10 రాష్ట్రాల్లో కరోనా వైరస్ను జయించగలిగితే... భారత్ కరోనాను జయించినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. వైరస్ సోకిన 72 గంటల లోపు పేషెంట్లను గుర్తించినట్లయితే వైరస్ వ్యాప్తి నెమ్మదిస్తుందని నిపుణులు చెప్తున్నట్లుగా తెలిపారు. 'కాంటాక్ట్ ట్రేసింగ్,కంటైన్మెంట్,సర్వైలైన్స్' కరోనా వ్యాప్తిని అడ్డుకునే ఎఫెక్టివ్ వెపన్స్ అని అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రధాని మోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం ఇది ఏడోసారి కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications