2019లో అధికారం మనదే!: కేంద్ర, రాష్ట్రాలపై ఉత్తమ్కుమార్ ఫైర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వరంగల్: 'అధైర్య పడకండి.. 2019లో అధికారం కాంగ్రెస్దే. అవిభక్త వరంగల్ ఐదు జిల్లాల్లోని రెండు పార్లమెంటు స్థానాలు, 12 శాసన సభ సీట్లు మనమే గెలుస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సమరభేరి మోగించాలి. గ్రామ గ్రామన పార్టీని బలోపేతం చేయాలి. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాం' అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు.
పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోశాల పద్మ అధ్యక్షతన గురువారం వరంగల్లోని ఇస్లామియా కళాశాల మైదానంలో నిరసన సభ జరిగింది. వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణ, మహబూబాబాద్, జయశంకర్, జనగామ జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదు. వీటిని ప్రజలకు వివరించాలి. పెద్దనోట్ల రద్దుతో జనం పడుతున్న అవస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకుండా బీజేపీకి వత్తాసు పలుకుతున్నారు' అని విమర్శించారు.
నాయకులందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు. శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెరాస పాలనపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై ఉద్యమించాలని కార్యకర్తలను కోరారు. పెద్ద నోట్లను రద్దు చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన కేంద్రంలోని భాజపా సర్కారును గద్దె దింపేందుకు సన్నద్ధం కావాలన్నారు.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శారద ప్రసంగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను చిన్న చూపు చూస్తుందన్నారు. మంత్రి మండలిలో ఒక్క మహిళకూ చోటు కల్పించ లేదని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు ప్రజావ్యతిరేకమన్నారు. కేంద్ర మాజీ సహాయ మంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ.. 2019లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది, ఉత్తమ్కుమార్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కొత్త పథకాలు ప్రారంభమయ్యాయని తెలిపారు.
మాజీ ఛీప్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో ఎన్నో అవకతవకలు జరిగాయన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి మాట్లాడుతూ.. తెరాస మొండి వైఖరిని అవలంబిస్తున్నదన్నారు. వ్యవసాయ రంగం, చేనేత, కుల వృత్తులు కుంటుపడ్డాయన్నారు.
నల్లధనం వెలికతీత పేరుతో పెద్ద నోట్లు రద్దు చేయడం సరైంది కాదన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. నయీం కేసు విషయంలో తెరాస తీరు బహిర్గతమైందన్నారు. సమస్యల పరిష్కారం కోసం మహిళలు ఉద్యమించాలన్నారు.మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పోశాల పద్మ మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.