వందేభారత్ సికింద్రాబాద్ - విశాఖ టైమింగ్స్ ఇలా : వారంలో ఆరు రోజులే - టికెట్ ధరలు..!!
తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ పరుగులు తీయటానికి సిద్దమైంది. సంక్రాంతి నాడు ఈ నెల15న ప్రధాని మోదీ వందేభారత్ ను వర్చువల్గా ప్రారంభించనున్నారు. వందేభారత్ రైలు ఇప్పటికే సికింద్రబాద్ చేరుకుంది. చెన్నై నుంచి వచ్చిన వందేభారత్ విశాఖ - సికింద్రాబాద్ మధ్య ట్రెయిల్ రన్ పూర్తి చేసారు. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే పలు రైళ్లు నడుపుతున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటం తో ఉదయం వేళ ఈ రైలును నడపాలని నిర్ణయించారు. మిగిలిన రైళ్ల కంటే తక్కువ సమయంలో గమ్యస్థానాలు చేరుకొనే అవకాశం కలుగుతుంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు మాత్రమే నడవనుంది. రైలు షెడ్యూల్ ను దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా ప్రకటించింది.
వారంలో ఆరు రోజులు..షెడ్యూల్ ఇలా..
వందేభారత్ ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు నడవనుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి మధ్యాహ్నం 2.15కు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మళ్లీ రాత్రి 11.30కు విశాఖపట్నం చేరుతుంది. వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో మాత్రమే నిలుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో ఉదయం 5.45కు బయలుదేరి రాజమండ్రి 7.55/7.57కు, విజయవాడ 10/10.05, ఖమ్మం 11/11.01, వరంగల్కు మధ్యాహ్నం 12.05/12.06, సికింద్రాబాద్ 14.15 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 15.00గంటలకు బయలుదేరి వరంగల్ సాయంత్రం 16.35/16.36 గంటలకు, ఖమ్మం 17.45/17.46, విజయవాడ 19.00/19.05, రాజమండ్రి 20.58/21.00, విశాఖపట్నం రాత్రి 23.30 గంటలకు చేరుతుంది.
దురంతో కంటే వేగంగా వందేభారత్
ఇప్పటి వరకు విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే ఇతర రైళ్ల కంటే త్వరగా గమ్య స్థానాలకు చేరుకుంటుంది. గరీబ్రధ్ ఎక్స్ప్రెస్ 11.10 గంటలు, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్కోస్ట్ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి. దురంతో రైలు 10.10 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. వందేభారత్ ఇతర రైళ్లతో పోలిస్తే దాదాపు మూడు గంటల సమయం ఆదా చేస్తుంది. రైలు గంటకు 180కి.మీ వేగంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ఉన్న 699 కిలోమీటర్లను 8.40 గంటల్లో కవర్ చేస్తుంది. ఇప్పటిదాకా ఈ రెండు నగరాల మధ్య అత్యంత వేగంగా పరుగులు పెట్టే దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుకుంటుంది. ప్రతీ రోజూ ఉదయం విశాఖ నుంచి.. మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. 20 నిమిషాల బ్రేక్తో తిరిగి విశాఖకు బయల్దేరి.. రాత్రికి చేరుకుంటుంది. ఇంటర్మీడియట్ స్టేషన్లు అయిన విజయవాడలో 5 నిమిషాలు.. వరంగల్, ఖమ్మం, రాజమండ్రి స్టేషన్లలో రెండేసి నిమిషాల చొప్పున అగనుంది.
సదుపాయాలు - ధరలు ఇలా
వందేభారత్ రన్నింగ్ లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇతర రైళ్ల కంటే ఈ రైలుకు లైన్ క్లియర్ చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇతర రైళ్లు షెడ్యూళ్లతో సంబంధం లేకుండానే వందేభారత్ ప్రయాణ వేళలు ఖరారు చేసారు. అయితే, టికెట్ ధరలు మాత్రం ఇతర రైళ్ల కంటే ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వందేభారత్ లో ఇతర రైళ్లలో లేని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్, ఉచిత వైఫై సౌకర్యం అందుబాటులో ఉండే ఈ రైలులో ఏసీ చైర్ కార్ ధర రూ. 1800, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ. 3300 వరకు ఉండొచ్చునని అంచనా. అయితే, విశాఖ - సికింద్రాబాద్ మధ్య పెరుగుతున్న రద్దీ తో పాటుగా ప్రత్యేక సదుపాయాలు ఉండటంతో ఈ రైలుకు భారీ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 15న తొలి రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం కానుంది.