మనిషై పుడితే.. సిగ్గుండాలి, హరీష్! నీ బండారం బయటపెడ్తా, రబ్బర్ చెప్పులతో నడిపిస్తా: వంటేరు
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి (ఆపద్ధర్మ) హరీష్ రావు అక్రమంగా సంపాదించిన ఆస్తులను బయటకు తీస్తానని, పదిహేడేళ్ల క్రితం ఆయన ఏ రబ్బరు చెప్పులతో తిరిగారో, అలా తిరిగేలా చేస్తానని, నేను గజ్వెల్ నియోజకవర్గం నుంచి గెలుస్తున్నానని మహాకూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తెరాస, గజ్వెల్ పోలీసులు, ఈసీ అధికారులపై ఆయన సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
హరీష్ రావు అంతా వదిలేసి వచ్చి గజ్వెల్లో ఉంటున్నాడని, గల్లీ లీడర్ గజ్వెల్ లీడర్గా మారిపోయాడన్నారు. ఆయన పని చేస్తే ఫర్వాలేదని, అలాగే ప్రజాస్వామ్యబద్దంగా ఓట్లు అడుక్కుంటే తనకు ఇబ్బంది లేదని, కానీ బార్లు ఓపెన్ చేశారని, బీర్లు, బిర్యానీలు పెట్టారని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని, ఇప్పటి వరకు రూ.50 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. దొంగ డబ్బులు పంచి, లిక్కర్ పంచి, కులాలను, మతాలగా కొని ఓట్లు వేయిద్దామనుకుంటున్నారని అన్నారు.
బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు, కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరో చెప్పారు!
ప్రచారం చేయకుండా గజ్వెల్ తీర్పుకు కట్టుబడదామా?
హరీష్ రావుకు ఓ భయం పట్టుకుందని వంటేరు ఎద్దేవా చేశారు. ఆయన ఇప్పుడు ఓ గల్లీ లీడర్ అయిపోయాడన్నారు. హరీష్ రావుకు తాను ఓ సవాల్ విసిరానని చెప్పారు. దానికి ఎందుకు ముందుకు రారని చెప్పారు. నేను పదిసార్లు సవాల్ చేశానని, ప్రపంచంలోనే గజ్వెల్ ఆదర్శంగా ఉండేలా కేసీఆర్ అభివృద్ధి చేశారని అంటున్నారని, అదే నిజమైతే.. నేను ప్రచారం చేయను, మీరు ప్రచారం చేయవద్దని, అప్పుడు గజ్వెల్ ప్రజలు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉందామా, దానికి మీరు ఒప్పుకుంటారా, సిద్ధమా అని సవాల్ విసిరారు.
నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు
హరీష్ రావు కేవలం గజ్వెల్లోనే ఉండి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని వంటేరు ఎద్దేవా చేసారు. తనను చూసి ఎందుకు భయపడుతున్నారని అన్నారు. అంటే ఈ నాలుగున్నరేళ్ల పాటు మీరు చేసిన అభివృద్ధి పైన విశ్వాసం లేదా ప్రజల మీద విశ్వాసం లేదా అని నిలదీశారు. మీరు ఎవరికి ఏం ఒరుగబెట్టారని ప్రశ్నించారు. ఇంటింటికి నల్లా ఇవ్వకుంటే ఓట్లు అడగనని సవాల్ చేశారని, మరి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి నల్లాలు వచ్చాయా, మరి ఓట్లు ఎందుకు అడుగుతున్నారన్నారు.
కేసీఆర్.. ఆ తల్లి తలకాయ పెట్టు తీస్తదా లేదా చూద్దాం
మనిషికి చీము, నెత్తురు ఉంటే, మనిషై పుట్టి ఉంటే ఇచ్చిన మాటకు కేసీఆర్ కట్టుబడి ఉండాల్సిందని వంటేరు అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేయకుంటే మెడ మీద తలకాయ తీసుకుంటానని చెప్పారని, ఇప్పుడు ఆయన ఆ పని చేస్తారా అన్నారు. మా వద్ద కోట మైసమ్మ తల్లి ఉందని, ఆ తల్లి వద్ద నీ తలకాయ అడ్డుపెట్టాలని, ఆ తల్లి తలకాయ తీస్తదా, ఉంచుతుందా చూద్దామన్నారు. కనీసం సొంత గజ్వెల్ నియోజకవర్గంలోనే దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేదన్నారు.
మళ్లీ ఓట్లు ఎలా అడుగుతున్నారు
కేజీ టు పీజీ ఎక్కడ ప్రారంభమైందని వంటేరు ప్రశ్నించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలలో రైతుల భూములు లాక్కొని, వారికి నష్టపరిహారం ఇవ్వకుండా, కనీసం భూములు కూడా ఇవ్వలేదని చెప్పారు. మల్కాపురం, ఎర్రవల్లి, నర్సన్నపేటలో ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. అక్కడ కూడా ఏదీ ఇవ్వలేదన్నారు. మళ్లీ ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటారని, ప్రగతి భవన్లో ఉంటారని చెప్పారు.
పొలాలు, ఇల్లు, అన్నీ అమ్ముకున్నా, బొందపెట్టేందుకు స్థలం లేదు
ఎక్కడో గజ్వెల్ నియోజకవర్గంలో డబ్బులు దొరికితే ఏసీపీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆ డబ్బులు ప్రయివేటు వాళ్లవని చెప్పారని, కానీ హరీష్ రావు మాత్రం ఆంధ్రోళ్ల డబ్బులు అని చెబుతున్నారని వంటేరు విమర్శించారు. తనకు ఉన్న పొలాలు అన్నీ అమ్ముకున్నానని, ఇల్లు అమ్మేశానని, పెంకుటిల్లు కూడా అమ్ముకున్నానని, ఇవాళ నేను కిరాయి ఇంట్లో ఉంటున్నానని, తనను బొంద పెట్టేందుకు స్థలం కూడా లేదని చెప్పారు. కంప్లీట్ అన్నీ అమ్మేశానని చెప్పారు. నేను ప్రజల తరఫున పోరాటం చేస్తున్నానని చెప్పారు. ప్రజల కోసం పోరాడుతున్నానని అన్నారు.
హరీష్ రావుకు సిగ్గు ఉండాలి
అలాంటి తనను పట్టుకొని ఆంధ్రోళ్ల డబ్బులు అంటున్నాడని, హరీష్ రావుకు అలా అనేందుకు సిగ్గు ఉండాలని వంటేరు అన్నారు. 45 రోజులుగా హరీష్ రావు గజ్వెల్లోనే ఉంటున్నారన్నారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి ఏం చేశావ్, మీకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని అడిగారు. మీకు సిగ్గు శరం ఉంటే మీకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. ప్రతి దానికి ఆంధ్రోళ్ల డబ్బులు అంటారా అన్నారు. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. మీరు డబ్బులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. మీ డబ్బు ఎక్కడిదో చెప్పాలన్నారు.
హరీష్.. నీకు అదే రబ్బరు చెప్పులు వచ్చేలా చేస్తా
నేను గెలుస్తున్నాను.. నీ అక్రమ సంపాదన, ఆస్తులు బయటపెడతానని హరీష్ రావును ఉద్దేశించి వంటేరు అన్నారు. 2001లో నీకు రబ్బరు చెప్పులు ఎలా ఉండెనో.. మళ్లీ అలా వచ్చేలా చేస్తానని హెచ్చరించారు. తాము ఎక్కడ ఫిర్యాదు చేసినా తీసుకోవడం లేదని చెప్పారు. పోలీసులకు, అక్కడి ఎన్నికల సంఘానికి ఇచ్చినా పట్టించుకోలేదని చెప్పారు. ఇక రక్షణ కల్పించేది ఎవరని అడిగారు. నేను పోలీసులతోనో, అధికారులతోనో కొట్లాడటం లేదన్నారు. ఇది తన ఆవేదన అన్నారు. తాను పదిహేనేళ్లుగా ఆస్తులు అమ్ముకున్నానని, రైతులు చనిపోతే వెళ్లానని, నియోజకవర్గంలో ఎవరికి ఆపద వచ్చినా తాను నిలబడ్డానని చెప్పారు.
రూ.8 లక్షల కోట్లు ఎక్కడికి పోయింది
2013 చట్టం ప్రకారం భూములు లాక్కున్నావని, భూములు తీసుకోవచ్చునని, కానీ చట్టాన్ని ఫాలో కావాలని వంటేరు సూచించారు. నీ ఫాంహౌస్కు రూ.60 లక్షలు, డెబ్బై లక్షలు పెట్టి కొంటావని, నాకు రూ.6 లక్షలు ఇస్తావా అన్నారు. వీటిని అడగొద్దా అన్నారు. టీడీపీ హయాంలో 9 డీఎస్సీలు, కాంగ్రెస్ హయాంలో 5 డీఎస్సీలు వచ్చాయని, కేసీఆర్ నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ పెట్టలేదని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని, స్కూల్స్, కాలేజీలు మూసివేశారన్నారు. రైతు ఆత్మహత్యలను పట్టించుకోలేదన్నారు. అసలు కేసీఆర్కు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. నీవు ఏం చేశావన్నారు. కేంద్రం నుంచి, అప్పు తీసుకొచ్చినవి సహా రూ.8 లక్షలకు పోగా కోట్లు వచ్చాయని, కానీ ఈ డబ్బు ఏమయిందని ప్రశ్నించారు. ఆ డబ్బు ఎక్కడకు పోయిందన్నారు.