'ఆంధ్రా బిర్యానీని పేడ అన్న కెసిఆర్.. బాబు విందు భేష్ అన్నాడు': అది 'గ్రేటర్' ప్లాన్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్రా బిర్యానీ పేడలా ఉంటుందని చెప్పిన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇప్పుడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన విందు మాత్రం చాలా బాగుందని చెప్పడం విడ్డూరమని వైసిపి నేత వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ ఏకాంత సమావేశాల గుట్టు ఏమిటో బయటపెట్టారని ఆమె డిమాండ్ చేశారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వైసిపి ఓటు వేసినందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారన్నారు.
ఇప్పుడు అదే ఇరు పార్టీల అధినేతలు ఏకాంత చర్చలు జరుపుతున్నారన్నారు. సంచలనం రేపిన ఓటుకు నోటు కేసును ఇద్దరు నేతలూ మర్చిపోయారా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ అధినేత జగన్ మంగళవారం గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు. బెజవాడలో కలకలం రేపుతున్న కాల్ మనీ వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు.
కెసిఆర్ ఏపీ పర్యటనపై మధుయాష్కీ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏపీకి వెళ్లి రొయ్యలు తిని రావడం వెనుక చాలా పెద్ద ప్రణాళిక ఉందని కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఢిల్లీలో ఎద్దేవా చేశారు. త్వరలో హైదరాబాదులో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రులను ఆకట్టుకునేందుకే కేసీఆర్ విజయవాడ వెళ్లి రొయ్యలు తినొచ్చాడన్నారు.
హైకోర్టుపై రెండు రోజులు హడావుడి చెయ్యడం, ఆ తర్వాత మర్చిపోవడం కేసీఆర్కు అలవాటుగా మారిందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్... ఈటెల రాజేందర్, బాల్క సుమన్ను వెంట పెట్టుకొని వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లాడన్నారు.