వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రసాదాల రేట్లు పెంపు
కరీంనగర్ : తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రసాదాల రేట్లు పెరిగాయి. నిత్యవసరాల ధరల పెరుగుదలతో ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంద గ్రాములు ఉన్న లడ్డూ ధరను 20 రూపాయలకు పెంచారు. అలాగే 500 గ్రాముల అభిషేకం లడ్డూ ధరను 100 రూపాయలకు పెంచారు. ఇక 1000 గ్రాముల బరువుండే కల్యాణం లడ్డూ ధరను 200 రూపాయలకు పెంచుతూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక పులిహోర 250 గ్రాముల ప్యాకెట్ను ఇకపై 15 రూపాయలకు అందించనున్నారు. పెంచిన రేట్లు ఆగస్టు 2వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
వేములవాడ రాజన్న సన్నిధికి మన రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో శివభక్తులు వస్తుంటారు. శివరాత్రి నాడు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు వీక్షించడానికి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి భక్తజనులు తరలివస్తుంటారు. ఇక్కడి ఆలయంలో కోడె మొక్కులకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. సంతానం కోసం గానీ.. తమ పిల్లలు బాగా చదువుకోవాలని గానీ.. ప్రయోజకులుగా తయారవ్వాలని కోరుకుంటూ శివుడికి భక్తిశ్రద్ధలతో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. అలా వేములవాడ రాజన్న ఆలయానికి విశేష ప్రాధాన్యముంది.

అంతేకాదు చాలామంది తమ పిల్లలకు ఇక్కడ పుట్టు వెంట్రుకలు తీయించడం ఆనవాయితీ. నిలువెత్తు బంగారం అంటూ బెల్లాన్ని తమ బరువుకు తగ్గట్లుగా శివుడికి సమర్పించడం కూడా మొక్కుల్లో ఓ భాగం. అలా శంకరుడిని కొలిచి మొక్కుతూ భక్తులు పెద్దఎత్తున క్యూ కడుతుంటారు. ఆ క్రమంలో ప్రసాదాలు కూడా పెద్దఎత్తున తీసుకెళుతుంటారు. అయితే నిత్యావసరాల ధరలు పెరగడంతోనే ప్రసాదాల రేట్లు పెంచాల్సి వచ్చిందని ఆలయ కమిటీ చెబుతోంది.












Click it and Unblock the Notifications