రూ.1274 కోట్లపై రంగంలోకి వెంకయ్య: తెలంగాణ అకౌంట్లో వేయాలని ఆర్బీఐకి కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: తెలంగాణ ఖాతా నుంచి కేంద్రం తీసుకున్న రూ.1,250 కోట్ల నిధులు ఎట్టకేలకు తిరిగి రానున్నాయి. ఇందుకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తనవంతు ప్రయత్నాలు చేశారు! పన్ను చెల్లింపులో జాప్యాన్ని కారణంగా చూపుతూ కేంద్రం నిధులను తీసుకుంది.
దీంతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైంది. రెండు నెలల పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉద్యోగుల వేతనాలు మినహా ఏ ఇతర ఖర్చులకు కూడా నిధులు విడుదల చేయరాదని కూడా ప్రభుత్వం ఆయా శాఖలకు తేల్చి చెప్పింది.
ఈ నిధులను తిరిగి రాబట్టుకునేందుకు తెలంగాణ సర్కారు చేసిన యత్నాలు ఇప్పటిదాకా ఫలించలేదు. తాజాగా ఈ విషయంపై వెంకయ్య నాయుడు రంగంలోకి దిగారు. ఆదివారం నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆయన భేటీ అయ్యారు.
తెలంగాణ నుంచి తీసుకున్న నిధులను తక్షణమే ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన అరుణ్ జైట్లీని కోరారు. దీనికి స్పందించిన జైట్లీ రెండు రోజుల్లోగా ఆ నిధులను తెలంగాణ ఖాతాకు జమ చేస్తామని వెంకయ్యకు హామీ ఇచ్చారు.

ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ బకాయిపడిన మొత్తాల కింద తెలంగాణ ప్రభుత్వ నిధులను రిజర్వుబ్యాంకు నుంచి ఐటీశాఖ ఇటీవల మళ్లించుకుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్ళారు.
మంత్రి కేటీఆర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి హుటాహుటిన ఢిల్లీకి వచ్చి ఆర్థిక మంత్రిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా రిజర్వు బ్యాంకు ద్వారా నిధుల మళ్లింపు చట్టవిరుద్ధమని, ఏ విధంగా చూసినా తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పన్నుదారు కాదని వారు స్పష్టం చేశారు.
ఇదే విషయాన్ని వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఎంపీ వినోద్ కుమార్ కూడా లేవనెత్తారు. అయితే, ప్రయత్నాలు సఫలం కాలేదు. ఆదివారం వెంకయ్య ఈ విషయంలో జోక్యం చేసుకుని అరుణ్ జైట్లీతో మాట్లాడి పరిష్కరించారు.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల అమలులో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని, అందువల్ల ఈ నిధులను రాష్ట్ర ఖాతాలో జమ చేయాలని వెంకయ్య విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి స్పందించి వెంటనే ఆ నిధులను తిరిగి రాష్ట్ర ఖాతాలోకి జమచేసేలా చర్యలు తీసుకుంటానని, రెండు మూడు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయిస్తానని చెప్పారు.
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు కేంద్రం లేఖ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికపరంగా పెద్ద ఊరట లభించింది. గతంలో కేంద్రం ఆదాయ పన్ను శాఖ తీసుకున్న రూ.1274 కోట్ల మొత్తాన్ని తిరిగి ఇవ్వనుంది. ఈ విషయమై కేంద్రం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్కు
లేఖ రాసింది. ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణ అకౌంట్లో వేయాలని చెప్పింది.












Click it and Unblock the Notifications