'రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా అన్నదమ్ములే'
హైదరాబాద్: రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా అన్నదమ్ములేనని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. హైదరాబాద్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
త్వరలో భద్రాచలం-విజయవాడ హైవే ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారం తెరిపిస్తామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కలసికట్టుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రాలు విడిపోయినా తెలుగువారంతా అన్నదమ్ములేనని ఆయన తెలిపారు. మార్చి 22న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధులు ఓడితే ప్రభుత్వ వైఖరి మారుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
గత పదేళ్లుగా దేశంలో అభివృద్ధి శూన్యమని, మోడీ ప్రధాని ఆయిన తర్వాత దేశంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నల్గొండ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో కూడా బీజేపీని గెలిపించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
భౌగోళికంగా వేరయినా అందరం తెలుగువాళ్లమేనని అన్నారు. మోడీ పరిపాలనలో ధరలు తగ్గుముఖం పట్టాయని, స్వాతంత్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఎంతోమందికి దేశంలో బ్యాంకు ఖాతా లేదని, మోడీ పాలనలో సామాన్యులకు సైతం బ్యాంకు ఖాతాలు వచ్చాయని అన్నారు.

అంతక ముందు ఉదయం గుంటూరులో రమేష్ కార్డియాలజి ఆసుపత్రిని భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంతో కలసి ప్రారంభించిన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏపీ కొత్త రాజధాని ప్రాంతమైన తుళ్లూరుతో పాటు చుట్టు పక్క నగరాలను అభివృద్ధి చేస్తేనే అంతర్జాతీయ స్ధాయి రాజధాని ఏర్పాటవుతుందన్నారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో మంచి నీరు, మురుగునీటి పారుదల నిమిత్తం రూ. 1000 కోట్ల కేటాయించామన్నారు. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆసుపత్రుల నిర్మాణాలు జరగాలన్నారు.












Click it and Unblock the Notifications