#PriyankaReddy: టోల్ గేట్ సీసీటీవీ ఫుటేజీలో చివరిసారిగా కనిపించిన ప్రియాంకా, అక్కడే స్కూటీ పార్క్
హైదరాబాద్: తెలంగాణలోని షాద్ నగర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన వెటరినరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి ఉదంతం.. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కిరాతక ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. షాద్ నగర్ పట్టణంలో హైదరాబాద్-కర్నూలు జాతీయ రహదారిపై నిర్మించిన ఫ్లైఓవర్ కింద ఆమె మృతదేహం లభించింది. వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఫ్లైఓవర్ కిందే గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
టోల్ గేట్ సీసీటీవీ ఫుటేజీలో ప్రియాంకా రెడ్డి
హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి టోల్ గేట్ వద్ద ఈ నెల 27వ తేదీన అంటే.. బుధవారం సాయంత్రం 6:08 నిమిషాలకు ప్రియాంకా రెడ్డి తన స్కూటీ మీద చివరిసారిగా కనిపించినట్లు అనుమానిస్తున్నారు. టోల్ గేట్ వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. 44 సెకెన్ల పాటు ఉన్న ఈ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. స్కూటీపై ప్రియాంకా రెడ్డి అటుగా రావడం సీసీటీవీ ఫుటేజీల్లో కనిపిస్తోంది. దీని ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
టోల్ గేట్ వద్ద ఎందుకు స్కూటీని పార్క్ చేయాల్సి వచ్చిందంటే..
ప్రియాంకా రెడ్డి వ్యక్తిగత పనుల మీద హైదరాబాద్ శివార్లలోని గచ్చిబౌలికి వెళ్లాల్సి వచ్చింది. దీనితో ఆమె తన ఇంటి వద్ద నుంచి స్కూటీపై టోల్ గేట్ వద్దకు చేరుకున్నారు. అక్కడే స్కూటీని పార్క్ చేశారు. ఈ పార్క్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. స్కూటీని పార్క్ చేసిన అనంతరం ఆమె క్యాబ్ బుక్ చేసుకుని గచ్చిబౌలికి వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో ఆమె మళ్లీ టోల్ గేట్ వద్దకు వచ్చారు.
Recommended Video
అదే సమయంలో భవ్యా రెడ్డికి ఫోన్..
అదే సమయంలో ప్రియాంక రెడ్డి తన చెల్లెలికి ఫోన్ చేశారు. ఆ తరువాత ఫోన్ స్విచాఫ్ అయింది. దీనితో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు టోల్ గేట్ వద్దకు వెళ్లి ఆరా తీశారు. అన్ని చోట్లా గాలించినప్పటికీ ప్రియాంక రెడ్డి ఆచూకీ తెలియరాలేదు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రియాంక రెడ్డి మిస్సింగ్ కేసు నమోదయింది. తెల్లవారు జామున షాద్ నగర్ ఫ్లైఓవర్ వద్ద స్థానికులు ప్రియాంకా రెడ్డి మృతదేహాన్ని గుర్తించారు.
శంషాబాద్ లోనే నివాసం..
ప్రియాంక రెడ్డి వెటరినరీ డాక్టర్. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేటలో ఆమె పని చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె స్వగ్రామం. తన కుటుంబంతో కలిసి ప్రియాంకా రెడ్డి శంషాబాద్లో నివాసం ఉంటున్నారు. ప్రియాంకా రెడ్డి చెల్లెలు భవ్యా రెడ్డి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తుండటం వల్ల ఆమెకు అనువుగా ఉంటుందనే కారణంతో శంషాబాద్ లో నివసిస్తున్నట్లు చెబుతున్నారు.