వెంకయ్యపై ప్రశంసలు: జానారెడ్డి ఏం సంకేతాలిస్తున్నారు?
వెంకయ్యనాయుడుపై శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడుపై శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డి ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉండి.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని పొగడటం ఏంటని సొంత పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీ పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకయ్యపై పొగడ్తలు చేయడం ఎంతవరకు సమంజసమని పలువురు కాంగ్రెస్ నేతలు జానా రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ఓ వైపు కాంగ్రెస్ గోపాలకృష్ణ గాంధీ గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంటే.. సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి.. వెంకయ్యను ప్రశంసించి ఎలాంటి సంకేతాలిస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఈ అంశంపై కాస్త సీరియస్గానే స్పందించారు.
కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రస్తావిస్తామని వీహెచ్ చెప్పారు. కాగా, గతంలో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన రూ.5భోజనం చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని జానారెడ్డి మెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు జానారెడ్డి.. వెంకయ్యపై ప్రశంసలు కురిపించడంతో బీజేపీ వైపు ఏమైనా చూస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.