రేవంత్ వర్సెస్ వీహెచ్: రైతు పొలికేక వేదికగా మాటల యుద్ధం.. బీసీలకే పీసీసీ చీఫ్ పదవీ అనడంతో..
తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు, రేవంత్రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మంలో చేపట్టిన 'రైతు పొలికేక' సభలో విభేదాలు బహిర్గతం అయ్యాయి. బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇవ్వాలని హనుమంతరావు అన్నారు. దీంతో సభలోని కొందరు రేవంత్కు మద్దతుగా అనుకూల నినాదాలు చేశారు.
పట్టించుకోని వీహెచ్..
వారిని వీహెచ్ పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చినవారిని చేర్చుకుని టికెట్ ఇవ్వడం సరికాదన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని అన్నారు. వీహెచ్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ కాంగ్రెస్లో అమ్ముడుపోయే నేతలు ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి ఏరివేయాలని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో డిపాజిట్లు రాని నాయకుల పెత్తనం కొనసాగుతోందని, ఇకపై అలా జరగబోదని అధిష్ఠానం కూడా తేల్చి చెప్పిందని అన్నారు.
ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు
ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారన్నది ముఖ్యం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులనే ప్రజలు గెలిపిస్తారని అభిప్రాయపడ్డారు. రేవంత్, వీహెచ్ వాగ్వివాదంతో సభలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తర్వాత భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నేతలు సర్దిచెప్పారు. దీంతో గొడవ సద్దుమణిగింది.
Recommended Video
సహజమే కానీ
కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సహజమే. కానీ పీసీసీ చీఫ్ మార్పు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎవరీ వాదన వారు వినిపిస్తున్నారు. రైతు పోలికేక సభ వేదికపై వీహెచ్ వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం దీనికి నిదర్శనం అని చెప్పవచ్చు. ఎన్నికలకు మరో 3 ఏళ్ల సమయం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటినుంచే పార్టీలో మార్పులు చేయాలని హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీని మార్చివేసింది. తదుపరి పీసీసీ చీఫ్ను మార్చడమే మిగిలి ఉంది.