చంద్రబాబు ఫోన్ వేస్ట్: కేటీఆర్తో విజయరామారావు భేటీ, రెండు రోజుల్లో కేసీఆర్తో
హైదరాబాద్: 'ఆపరేషన్ ఆకర్ష్' తో తెలంగాణలో వేగంగా మారుతున్న రాజకీయాలు పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఇందులో భాగంగా శుక్రవారం టీడీపీకి రాజీనామా చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావుకు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేశారు.
పార్టీ మారే విషయంలో తొందరపడొద్దని ఆయనకు సూచించినట్లుగా తెలుస్తోంది. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచే ఫోన్ రావడంతో విజయరామారావు సిందిగ్ధంలో పడ్డారు. దీనిపై ఆలోచించి తన నిర్ణయం చెబుతానని బదులిచ్చారు.
ఇది ఇలా ఉంటే టీడీపీకి రాజీనామా చేసిన విజయరామారావు టీఆర్ఎస్లోకి చేరేందుకు దాదాపు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. విజయరామారావుని టీఆర్ఎస్లోకి ఆహ్వానించడానికి మంత్రి కేటీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. బంజారాహిల్స్లోని విజయరామారావు నివాసానికి వెళ్లి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యావంతుడు, ఎంతో అనుభవం ఉన్న విజయరామారావు అనుభవాన్ని పార్టీకి ఉపయోగించుకునే క్రమంలోనే ఆయన్ని టీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. గతంలో విద్యావంతులు ఓటు హక్కు వినియోగించుకోరనే భావన ఉండేదని అలాంటి భావనను చెరిపివేసిన ఘనత విజయరామారావుదేనని అన్నారు.
విద్యావంతులు రాజకీయాల్లోకి రావటం వల్ల ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ తెలిపారు. అనంతరం విజయరామారావు మాట్లాడుతూ రెండు రోజుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ నేతలు ఆయనతో చర్చలు జరిపారు. గ్రేటర్ ఎన్నికల దృష్ట్యా విజయరామారావు చేరికి టీఆర్ఎస్కు అనుకూలిస్తుందని అంటున్నారు. విజయరామారావు స్థాయి, హోదాలను దృష్టిలో ఉంచుకునే ఆయన్ని సగౌరవంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు కూడా టీడీపీకి గుడ్బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కాగా, విజయ రామారావు తెలుగుదేశం పార్టీలో కీలక నేత. 1999లో ఆయన ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. గతంలో విజయ రామారావు సిబిఐ డైరెక్టరుగా పని చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి జనార్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.