మగవాళ్లు మాత్రమే వస్తారా?, ఆశ్చర్యం వేసింది: సొంత పార్టీకి విజయశాంతి షాక్
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి సొంత పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రచార పోస్టర్ పైన మహిళ ఫోటో లేకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ కేబినెట్ పైన విమర్శలు చేసే మనమే ఇలా చేయడం ఏమిటని వాపోయారు. సొంత పార్టీ నేతల తీరును ఆమె తప్పుబట్టారు.
కేసీఆర్ను విమర్శిస్తాం, ఆశ్చర్యం
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని మనం విమర్శలు చేస్తుంటామని, మరి యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సభకు చెందిన ప్రకటనలో ఒక్క మహిళ ఫోటో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.
మగవాళ్లు మాత్రమే ఉంటారా?
సోనియా గాంధీ హాజరయ్యే సభలో కేవలం మగవాళ్లు మాత్రమే ఉంటారా అని విజయశాంతి ప్రశ్నించారు. మహిళలు కూడా పాల్గొంటారని గుర్తుంచుకోవాలని చెప్పారు. సోనియా గాంధీ ప్రచార సభకు సంబంధించిన పోస్టర్లో ఒక్క మహిళ ఫోటో లేకపోవడం ఏమిటని ఆమె నిలదీశారు.
అంతా తారుమారు, తగ్గిన టీడీపీ.. 14వ సీటు వదిలేసిన తమ్ముళ్లు: లాస్ట్ మినిట్లో ఊహించని ట్విస్ట్లెన్నో
సోనియా గాంధీ ప్రచారం
ఈ నెల 23వ తేదీన సోనియా గాంధీ తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఆమెతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేస్తారు. భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం పోస్టర్లను తయారు చేశారు. ఇందులో సోనియా గాంధీ మినహా అందరు పురుష నేతల ఫోటోలే ఉన్నాయి. దీనిపై రాములమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు.
విజయశాంతి ఫోటో లేదు
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత తొలిసారిగా నవంబర్ 23వ తేదీన తెలంగాణ గడ్డపై అడుగిడుతున్న సోనియా గాంధీ గారికి, భావి భారత ప్రధాని, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీకి స్వాగతం, సుస్వాగతం అంటూ ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇందులో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా, విహెచ్, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి, మల్లుభట్టి విక్రమార్క తదితరుల ఫోటోలు ఉన్నాయి. విజయశాంతి స్టార్ క్యాంపెయినర్. కానీ ఆమె ఫోటో మాత్రం లేదు. స్టార్ క్యాంపెయినర్ ఫోటో పెట్టకపోవడం గమనార్హం.