ఉద్యమంలో కేసీఆర్ కంటే నేనే సీనియర్, అప్పుడు పారిపోయాడు: విజయశాంతి
హైదరాబాద్: కేసీఆర్ తనను దేవుడు ఇచ్చిన చెల్లెలు అని చెప్పేవారని, తాను మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన కూడా మారిపోయారని, తమ మధ్య జరిగే యుద్ధంలో ధర్మమే గెలుస్తుందన్నారు. చివరిసారి తాము పార్లమెంటులో ఎదురుపడ్డామని, ఆ తర్వాత కేసీఆర్ను కలవలేదన్నారు.
విపక్షాలపై కేసులు పెడితే కేసీఆర్కే నష్టమని చెప్పారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వారే తనకు ఫోన్ చేసి చెబుతున్నారని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. ఆ విజయాన్ని సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చెప్పారు. తాను అసెంబ్లీకి పోటీ చేయాలని భావించడంలేదని, ప్రస్తుతానికి ప్రచారం చేస్తానని, లోకసభకు పోటీ చేసే విషయమై ఆలోచిస్తానన్నారు.

సోనియా చెప్పగానే నన్ను సస్పెండ్ చేశారు
కేసీఆర్ ఎలా పాలిస్తున్నారో చూసిన తర్వాత మాట్లాడాలనే ఉద్దేశ్యంతోనే తాను ఇన్నాళ్లు ఊరుకున్నానని, ఆయన ఏమైనా అద్భుతాలు చేస్తారేమోనని చూశానని విజయశాంతి అన్నారు. తెలంగాణను ఇస్తున్నామని 2013లో కాంగ్రెస్ ప్రకటించిన నాటి రాత్రే తనను టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారన్నారు. అప్పట్లో తనను సస్పెండ్ చేయడానికి కారణం ఏమిటనే విషయం చెప్పలేదన్నారు. 2014లో ప్రత్యేక రాష్ట్ర బిల్లు పాసైన తర్వాతే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.

కూటమిలో తెలుగుదేశంపై నేను బయట చెప్పను
తెలంగాణ గురించి తాను తాను అనుకున్నది ఒకటైతే, ఇక్కడ మరొకటి జరుగుతోందని విజయశాంతి అన్నారు. అందువల్లే తాను తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ఆలస్యంగా ప్రకటించినా ఎటువంటి సమస్య ఉండదని చెప్పారు. తెరాస అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతే తమ బలమన్నారు. ఇక కూటమిలో టీడీపీ ఉండటంపై తన అభిప్రాయాన్ని అధిష్ఠానంతో ఇప్పటికే చెప్పానని, దాని గురించి బయట చర్చించడం సరికాదన్నారు.

కేసీఆర్ కంటే నేను సీనియర్
తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కంటే తానే ఉద్యమంలో సీనియర్ను అని విజయశాంతి అన్నారు. 1998లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి, ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న సమయంలో కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా, తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని, దీంతో కొన్ని సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చిందన్నారు.

నాలుగేళ్లకే పారిపోయిన కేసీఆర్
బలహీనపడ్డ తాను తిరిగి ఫిట్ అవ్వడానికి కొంత సమయం పట్టిందని విజయశాంతి తెలిపారు. ప్రజలంతా ఒకే వైపు నిలబడి అయిదేళ్లు అధికారంలో ఉండాలని కేసీఆర్ను గెలిపిస్తే, నాలుగేళ్లకే ఆయన పారిపోయారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి, కాంగ్రెస్ను గెలిపించడం ద్వారా బహుమతిని ఇస్తానన్నారు.












Click it and Unblock the Notifications