‘కేసీఆర్ దొర గారి సర్కారు’: తెలంగాణలో దుర్భర పరిస్థితంటూ విజయశాంతి హెచ్చరిక
హైదరాబాద్: కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు ఇప్పుడప్పుడే తెరచుకునే పరిస్థితి లేకపోవడంతో వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు, అధ్యాపకుల జీవితం ఆగమ్యగోచరంగా మారింది. ఉపాధి లేకపోవడంతో కొందరు వృత్తి పనులు చేస్తుండగా.. మరికొందరు కూలీలుగా మారిపోతున్నారు.
Recommended Video

తెలంగాణ ప్రతిష్టకు మచ్చగా..
ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణలో ప్రయివేట్ టీచర్లు వీధినపడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రతిష్టకు మచ్చగా మారిందన్నారు.

చాలిచాలని జీతాలతో...
ప్రయివేట్ స్కూల్ టీచర్ల వ్యథ గురించి ప్రధాన మీడియాలోను, సోషల్ మీడియాలోను కుప్పలుతెప్పలుగా వార్తలు వస్తున్నప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం ఏమీ చలించడం లేదని విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో చాలా ప్రయివేటు విద్యాసంస్థలు టీచర్లను ఇష్టమొచ్చినట్టు తొలగించి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ధ్వజమెత్తారు. కొందరికి మాత్రం చాలీచాలని జీతాలిచ్చి ఇంకొందరికి అడ్మిషన్లు తెస్తేనే మీ ఉద్యోగం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయని తెలిపారు.

రోజు కూలీలుగా మారుతున్నారంటూ ఆవేదన..
ఈ మధ్యే వచ్చిన వార్తలని గమనిస్తే ఒక ప్రయివేట్ స్కూలు టీచర్ ఉద్యోగం కోల్పోయి ఖమ్మంలో టిఫిన్ బండి పెట్టుకున్నారు. యాదాద్రిలో మరొక ప్రయివేట్ స్కూల్ టీచర్ కుటుంబాన్ని పోషించుకోవడానికి దినసరి కూలీగా మారారు. మహిళా టీచర్లు కొందరు బీడీలు చుట్టే పనుల్లోకి, మాస్కుల తయారీ, టైలరింగ్ ఇంకా ఉపాధి హామీ పనుల్లోకి వెళ్ళాల్సి వచ్చిందని విజయశాంతి వివరించారు.
మన గ్రంథాలు, సమాజ వ్యవస్థలు గురువులకు ఎంతో గౌరవాన్నిచ్చాయి. అయితే, తెలంగాణలో మాత్రం టీచర్లు తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ దొరగారి సర్కారంటూ హెచ్చరిక
ఇదిలా ఉంటే కరోనా సమస్యలు, లాక్డౌన్ వల్ల ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాల్సిన ప్రయివేట్ స్కూళ్ళు మొత్తం ఫీజు కోసం తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తున్నాయి. మొత్తం ఫీజు చెల్లించకపోతే వారి పిల్లలకు డిజిటల్ క్లాసులు నిలిపివేస్తున్నాయి. ఈ పరిస్థితిని మీడియాలో కళ్ళకుకట్టినట్టు చెబుతూనే ఉంది. తెలంగాణలో విద్యావ్యవస్థ తీరు రోజురోజుకూ దిగజారుతోందనడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. కేసీఆర్ దొర గారి సర్కారు ఇప్పటికైనా ఈ విషయం మీద దృష్టి సారించకుంటే పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుందని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications