అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు అంటూ .. స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ వ్యాఖ్యలపై విజయశాంతి సెటైర్
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై స్పందించిన కేటీఆర్ తీరుపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బిజెపి నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ప్రకటనపై తన స్పందన తెలియజేశారు. అమ్మకు అన్నం పెట్టలేనోడు .. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అంటూ ఎద్దేవా చేశారు . తెలంగాణ ఉద్యమ కాలంలో కెసిఆర్ కుటుంబం ఇచ్చిన హామీలు ప్రజలందరికీ తెలుసని పేర్కొన్న విజయశాంతి ఓట్ల కోసమే స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు.
ఈ రోజు విశాఖ ఉక్కుపై పడ్డారు , రేపు సింగరేణి , బీహెచ్ఈఎల్ పై పడతారు : కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఉమ్మడి రాష్ట్రంలో మూతపడిన కంపెనీల మాటేమిటి ? ప్రశ్నించిన విజయశాంతి
తెలంగాణ ఉద్యమ కాలంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు టిఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని విజయశాంతి గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణ రాష్ట్రంలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ వంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపిస్తామని, ఉద్యోగాలు ఇస్తామని టిఆర్ఎస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం మాట మాత్రంగానైనా వాటి ప్రస్తావన చేయడం లేదని తీవ్ర విమర్శలు చేశారు విజయశాంతి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసమే స్టీల్ ప్లాంట్ రాజకీయం అని ఆగ్రహం
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ మంత్రి కేటీఆర్ కు ఏపీ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఒక్కసారిగా ఇంత అభిమానం పుట్టుకురావడం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం అని విజయశాంతి పేర్కొన్నారు. ప్రస్తుతం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాట్లాడుతున్న మాటలే తప్ప, దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఎంత అసభ్యకరంగా ,అవమానించే ధోరణిలో, బూతు మాటలతో కూడుకొని ఉంటుందో ఒకసారి గతం గుర్తు చేసుకుంటే మంచిదని విజయశాంతి పేర్కొన్నారు.
ఈ రోజు ఏపీకి జరిగిన అన్యాయం రేపు తెలంగాణాకు జరగదా అంటున్న కేటీఆర్
వీరు ప్రస్తుత ప్రకటనను సమర్ధిస్తున్న ఆయా నేతలు సరిగ్గా దీని అర్థం చేసుకోవాలని రాములమ్మ పేర్కొన్నారు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన బాట పట్టిన విశాఖ కార్మిక లోకానికి అండగా తెలంగాణ రాష్ట్రం ఉంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈరోజు విశాఖలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన కేటీఆర్ రేపు మనకు కూడా జరగొచ్చని పక్క రాష్ట్రంలో కష్టం వస్తే మనకేంటి అని ఊరుకుంటే, రేపు మనకు కష్టం వస్తే ఎవరు ఉన్నారు ? ఎవరు ఉంటారు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణాలో ముందు మీ హామీలు నెరవేర్చండి అంటున్న విజయశాంతి
ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తే చూస్తూ సహించేది లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలను ముందుగా పరిష్కరించమని, తెలంగాణ రాష్ట్రంలో మూతపడిన సంస్థలను తిరిగి తెరిపించి, ఇక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బిజెపి నేత విజయశాంతి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు.