సొంతపార్టీ నేతలపై విజయశాంతి షాకింగ్ వ్యాఖ్యలు!!
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ పార్టీలోనూ అంతర్గత కలహాలు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా విజయశాంతి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ మాత్రం ఆగలేదని మరోమారు స్పష్టం అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి లోకి వచ్చిన తర్వాత దూకుడుగా రాజకీయాలలో ముందుకు వెళతారని భావించిన విజయశాంతి ఇప్పుడు సొంత పార్టీ పైన తీవ్ర అసహనంతో ఉన్నారు. ఫైర్ బ్రాండ్ విజయశాంతి, స్టార్ క్యాంపైనర్ గా గుర్తింపు పొందిన విజయశాంతి ప్రత్యర్థి పార్టీల నాయకులను ఉతికి ఆరేయడం లో అందెవేసిన చేయి. అటువంటి విజయశాంతికి ప్రస్తుతం బిజెపి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలో విజయశాంతి పార్టీ మారుతున్నారు అన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీ సి డబ్ల్యూసి సమావేశాల సందర్భంగా సోనియాగాంధీ విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. తాను వ్యక్తిగతంగా సోనియాగాంధీని అభిమానిస్తాను అంటూ పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యలతో కూడా విజయశాంతి పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ఆ వార్తలను విజయశాంతి ఖండించారు. ఇది కావాలని జరుగుతున్న దుష్ప్రచారం అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన విజయశాంతి కొందరు తమ పార్టీ నేతలు పనిగట్టుకుని తనపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. పార్టీ అంతర్గత విషయాలను లీక్ ల పేరుతో బయటకు వెల్లడించడం తనకు రాదని పేర్కొన్న విజయశాంతి బిజెపిలోని కొందరు నేతలను టార్గెట్ చేశారు.
బండి సంజయ్ ను వ్యతిరేకించిన వర్గమే విజయశాంతిని టార్గెట్ చేస్తున్నట్టుగా పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. అప్పట్లో బండి సంజయ్ ను అధ్యక్షుడిగా తొలగించకుండా ఉండాలని విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ బీజేపీ అధ్యక్షుడి మార్పు జరిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా విజయశాంతి వ్యాఖ్యలతో బిజెపిలో అంతర్గత కలహాలు ఇంకా కొనసాగుతున్నట్లు అర్థమవుతుంది.












Click it and Unblock the Notifications