కేసీఆర్ రాక్షసుడు; శివుడు మూడోకన్ను తెరిచి కెసిఆర్ ని భస్మం చేస్తాడు: భగ్గుమన్న విజయశాంతి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి నిత్యం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున విషయం తెలిసిందే. నిత్యం రాష్ట్రంలోని అనేక సమస్యలపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన విజయశాంతి తాజాగా రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ప్రతి ఏటా ఇస్తానన్న 100 కోట్ల నిధుల హామీపై బిజెపి చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో విజయశాంతి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలో సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు విజయశాంతి.

కెసిఆర్ రాక్షసుడు.. వేములవాడ రాజన్నకు ఇస్తానన్న నిధులు ఇవ్వటం లేదు
ఏటా రాజన్న ఆలయానికి 100 కోట్ల నిధులు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారని విజయశాంతి మండిపడ్డారు. కెసిఆర్ ధర్మానికి విరుద్ధంగా వెళుతున్నారని బిజెపి నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ రాక్షసుడు అంటూ మండిపడ్డారు. కెసిఆర్ కు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి చెందటం ఇష్టంలేదని విజయశాంతి ఆరోపణలు గుప్పించారు. ఇచ్చిన మాట మీద నిలబడే లక్షణం కేసీఆర్ కు లేదని ఎద్దేవా చేశారు.

ఇప్పటివరకు 700కోట్ల రూపాయలు ఇవ్వాలి
సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి వంద కోట్ల చొప్పున ఇప్పటి వరకు ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు విజయశాంతి. కెసిఆర్ కు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే కేసీఆర్ కు సంస్కారం లేదని మండిపడ్డారు. దేవుడి విషయంలో కూడా కేసిఆర్ అబద్ధాలు ఆడారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ ని తాను మీరు అని సంబోధించను అని, నువ్వు అని సంబోధిస్తాను అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

వేములవాడ ఆలయంలో భక్తులకు సదుపాయాలు లేవు
ఇక వేములవాడ ఎమ్మెల్యే గా గెలిపించిన సార్ కాస్త జర్మనీలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. వేములవాడ ఆలయంలో భక్తులకు ఎలాంటి సదుపాయాలు లేవని, ఎక్కువ మంది భక్తులు వస్తున్నా, దర్శించుకునేందుకు వీలు లేకుండా ఉందని, గుడి చాలా చిన్నగా ఉందని పేర్కొన్నారు. చిన్న పిల్లలు, ముసలి వాళ్లు ఇబ్బంది పడుతున్నారని విజయశాంతి మండిపడ్డారు.

కేసీఆర్ హిందువా కాదా ? మండిపడిన విజయశాంతి
అభివృద్ధి చేయండి అంటే అరెస్టులు చేయడం కెసిఆర్ ప్రభుత్వ లక్ష్యంగా మారిందని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ హిందువా కాదా అంటూ మండిపడిన విజయశాంతి కెసిఆర్ ముస్లిమా? క్రిస్టియనా ? చెప్పాలని ప్రశ్నించారు.
హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అనడానికి మీకు నోరు ఎలా వచ్చిందంటూ గతంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నించారు విజయశాంతి. ప్రజలనే కాదు దేవుళ్ళను కూడా మోసం చేయగలిగిన టాలెంట్ కేసీఆర్ కు ఉందని మండిపడ్డారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు శివుడు మూడో కన్ను తెరుస్తారు అని, కెసిఆర్ ని భస్మం చేస్తాడని విజయశాంతి శాపనార్థాలు పెట్టారు.












Click it and Unblock the Notifications