విజయశాంతి చూపు బీజేపీ వైపు: కేంద్రమంత్రితో భేటీ, త్వరలోనే కమల దళంలో చేరిక?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత దూరమవుతున్నారా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న విజయశాంతి పార్టీ మార్పుపై ఆలోచిస్టున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్గా విజయశాంతి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీకి దూరంగా..
అయితే, గత కొంత కాలంగా విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. దుబ్బాక ఉపఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఆమె ప్రచారానికి రాలేదు. సోషల్ మీడియా వేదికగానే అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేగాక, దుబ్బాక బీజేపీ అభ్యర్తి రఘునందన్ రావు ఇంటిపై సోదాలు, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టులపైనా ఆమె స్పందించారు. పోలీసుల వ్యవహారశైలిపై, మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
బీజేపీ వైపు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో విజయశాంతి భేటీ..
ఈ క్రమంలోనే విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చేబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తూ సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్లోని విజయశాంతి నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సుమారు అరగంటపాటు ఈ భేటీ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. కాగా, కొద్ది రోజుల క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతితో భేటీ అయినట్లు తెలిసింది.
వచ్చే నెలలోనే ముహూర్తం.. కమల దళంలోకి?
నవంబర్ 10 లోపు ముహూర్తం ఖరారు చేసుకుని విజయశాంతి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దల సమక్షంలో విజయశాంతి కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. బీజేపీలో చేరికపై విజయశాంతి ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అటు బీజేపీ కూడా దీనిపై స్పందించలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి డీకే అరుణ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. మరికొంత మంది నేతలు కూడా బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.