యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని గులాబీ ప్రచారం కోసం వాడుకోవడం సిగ్గు చేటని కేసీఆర్ పై విజయశాంతి ఫైర్
తెలంగాణకే తలమానికం అయిన పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో రాతి స్థంభాలపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ, కారు చిత్రాలను చెక్కించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో శిల్పాలపై గులాబీ ప్రచారంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరుగుతున్నాయి.
ఇప్పటికే రాజా సింగ్ ,రేవంత్ రెడ్డి నేతలు దేవాలయ శిల్పాలపై జరుగుతున్న ప్రచారం పై ఆగ్రహం వ్యక్తం చేయగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, సినీనటి విజయశాంతి సైతం దేవాలయంలో కేసీఆర్ చిత్రాలను చెక్కించడంపై మండిపడుతున్నారు.

దేవాలయాల శిలలపై చిత్రాలు చెక్కించుకోవటం .. కేసీఆర్ రాజులా ఫీల్ అవుతున్నారనటానికి నిదర్శనం అన్న రాములమ్మ
పవిత్ర పుణ్యక్షేత్రాన్ని కూడా ప్రచారం కోసం వాడుకోవడం సిగ్గు చేటు అంటూ విజయశాంతి తిట్టిపోశారు. దేవాలయాల శిలలపై చిత్రాలు చెక్కించుకోవటం , కెసిఆర్ తనను తాను రాజుగా ఫీల్ అవుతున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనమన్నారు. రాజులు రాజ్యాలు లేని నేటి రోజుల్లో కూడా కేసీఆర్ ఇంకా దొరతనాన్ని ప్రదర్శించాలని చూడటం ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ మండిపడ్డ విజయశాంతి ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే సారు.. కారు.. సర్కార్ అనే డైలాగ్ వాడటం వెనుక ఆంతర్యం ఏమిటో ఇప్పుడు అర్థమైందంటూ సెటైర్లు వేశారు.

కేసీఆర్ తన చర్యలతో ఆలయ పవిత్రతను దెబ్బ తీస్తున్నారని విజయశాంతి ఆగ్రహం
ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో చేపడుతున్న ఆధునీకరణలో భాగంగా అక్కడ నిర్మిస్తున్న స్థూపాలలో దేవతామూర్తులతో పాటు కెసిఆర్.. కార్ గుర్తును.. టిఆర్ఎస్ సర్కార్ గుర్తును చెక్కడంపై విజయశాంతి మండిపాటుకు గురయ్యారు.సీఎం కేసీఆర్ తీరు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేదిగా ఉందంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి తో సమానంగా భావించే యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాజకీయ ప్రచారానికి వాడుకోవటం ఆలయ పవిత్రతను దెబ్బతీయడమేనని ఆమె పేర్కొన్నారు.

విజయశాంతి, హిందూ ధర్మాన్ని కాపాడే పెద్దలు, పాలకులకు కనువిప్పు కలిగించాలని కోరిన విజయశాంతి
ఇక కేసీఆర్ సర్కార్ తీరుపై పీఠాధిపతులు, మఠాధిపతులు స్పందించాల్సిన అవసరం ఉందని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ఈ విషయంపై చేసే ప్రకటనలను కేసీఆర్ రాజకీయ కోణంలో చూసి లైట్ తీసుకునే ప్రమాదముందని చెప్పిన విజయశాంతి, హిందూ ధర్మాన్ని కాపాడే పెద్దలు, పాలకులకు కనువిప్పు కలిగిస్తారని ఆశిస్తున్నానని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు . ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి శిల్పాలపై గులాబీ ప్రచారం ప్రస్తుతం రాష్ట్రంలో పెను దుమారం రేపింది. గతంలో ఎవరూ చేయని విధంగా , ఎవరూ ఊహించని విధంగా తెలంగాణా సర్కార్ తీసుకున్న నిర్ణయం పలు విమర్శలకు కారణం అవుతుంది .












Click it and Unblock the Notifications