కేసీఆర్ ప్రగతి, సాధికారతల పాట అందుకే.. అన్నీ ప్రగల్భాలే, నేను చెప్పిందే నిజమన్న విజయశాంతి
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి సీనియర్ నాయకురాలు విజయశాంతి మరోమారు విరుచుకుపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ ప్రగల్బాలేనని, గతంలో తాను కెసిఆర్ పై ఏదైతే చెప్పానో అదే జరుగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో గ్రామాలు, పట్టణాలు పర్యటించి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సాధిస్తాను అని కేసీఆర్ గారు చెప్పేవన్నీ ప్రగల్బాలే అని తాను ఇంతకు ముందు చెప్పినట్లు జరుగుతోందంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
Recommended Video
వాసాలమర్రి తరహాలో సామూహిక భోజనాలు చేసి రావడం తప్ప ఇంకేం చేస్తారు
సీఎం కేసీఆర్ ఒకవేళ బుద్ధి పుట్టి ఎక్కడికి వెళ్ళినా వాసాలమర్రి తరహాలో సామూహిక భోజనాలు చేసి రావడం తప్ప చేసేది ఏమీ లేదంటూ విజయశాంతి విమర్శించారు. అంతేకాదు కెసిఆర్ ఎక్కడికి వెళ్ళినా వరంగల్ మాదిరిగా నిరసన ఎదుర్కోవడం తప్ప ఒరిగేది ఏమీ లేదని వెల్లడించారు. ఇక తాజాగా సీఎం కేసీఆర్ కలెక్టర్లు అధికారులతో సమీక్ష నిర్వహించి జూలై నెల నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ప్రారంభించాలని, హరితహారం లో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు నాటించాలని ఆదేశాలు జారీ చేశారు.
హరితహారంతోనే పల్లె ప్రగతి, పట్టణప్రగతి .. అంతేగా
తాను చెప్పినట్టు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి కార్యక్రమాలను హరితహారం మొక్కలతోనే ముగించేటట్లు ఉన్నాడంటూ సెటైర్లు వేశారు. ఇక తాజాగా దళిత సాధికారత కోసం అంటూ అఖిలపక్షం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ కు విజయశాంతి సూటి ప్రశ్నలు సంధించారు. కెసిఆర్ ఎప్పుడు ఏం చేస్తారనేది? ఎందుకు చేస్తారు అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు .. ఇప్పుడు దళిత సాధికారత ఎందుకు గుర్తొచ్చిందో కూడా తెలుసు అన్న విజయశాంతి సార్ కు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ప్రతిపక్షాలు గుర్తుకొస్తున్నాయి అంటూ సెటైర్లు వేశారు.
ప్రగతి , సాధికారతల పాట అందుకే
కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే సీఎం గారు ఈ ప్రగతి, సాధికారతల పాట పాడుతున్నారు అన్నది సుస్పష్టం కాదా అంటూ మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఆర్భాటాలు చేసే ఈసారు తీరు తెలుసు కాబట్టి బీజేపీ అఖిలపక్షాన్ని బహిష్కరించింది అంటూ ట్వీట్ చేశారు. ఇదే సమయంలో తెలంగాణలో విపరీతంగా పంటలు పండుతున్నాయని , దేశ ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం మారుతుందని సీఎం కేసీఆర్ చెబుతున్నారని పేర్కొన్న విజయశాంతి కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు .
ఆయన చెప్పింది జరగదు... నేను చెప్పిందే జరుగుతుంది
తెలంగాణ రైతులు మద్దతు ధర లేక, కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడలేక పంటలకు నిప్పంటిస్తున్నారని వెల్లడించారు. ఎక్కడికి వెళ్లిన సీఎం కేసీఆర్ అభివృద్ధి బాటలో నడుస్తుంది అని చెబుతున్నారని, కానీ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఏవీ జరగవని, ఆయన విషయంలో తానేం చెప్తున్నానో అదే జరుగుతుందని విజయశాంతి మరోమారు నొక్కి చెప్పారు.