అతనికో లెక్క ఉంది: విలాసాలకు వరుస చోరీలు
హైదరాబాద్: పరుస చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఓ తెలివైన దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు అతను ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం చేశాడు. అన్నిటిలోనూ తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందాడు. అయితే విలాసాల కోసన నేరాల బాట పడ్డాడు. గణితంలో సూత్రాలను, భౌతికశాస్త్రంలో సమీకరణాలను గుర్తుంచుకున్నట్టుగానే ఏ ఇంట్లో ఎంత బంగారం దొం గిలించాడో నిద్రలో లేపి అడిగినా చెప్పేస్తాడు.
సైబరాబాద్లో వరుస చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఆ నేరగాడ్ని హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ నేరపరిశోధన విభాగ ఓఎస్డీ డాక్టర్ బి.నవీన్కుమార్, అదనపు ఉపకమిషనర్ శ్రీనివాసరెడ్డి, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ పి.కాశీరెడ్డితో కలిసి గచ్చిబౌలిలోని కమిషనరేట్లో సోమవారం వెల్లడించారు. బెంగళూరులోని ఆంధ్రాహల్లి విద్యామన్య నగర్కు చెందిన కల్యా విజయసింహ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు.
బెంగళూరులో డిగ్రీ వరకు ఇంగ్లీష్ మీడియం చదివాడు. తెలివైన విద్యార్థిగా గుర్తింపు పొందిన విజయసింహ వ్యసనాలకు బానిసై చోరీల బాట పడ్డాడు. 1997నుంచి బెంగళూరులో మొదలుపెట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేరాలు చేశాడు. కర్ణాటకలోని యశ్వంత్పూర్, శ్రీరాంపురంలో దొంగతనాలు చేశాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం లా సన్స్ బే కాలనీలో గదిని అద్దెకు తీసుకుని అక్కడా చోరీలు చేశాడు. తర్వాత హైదరాబాద్కు మకాం మార్చి చోరీలు చేసి 2013లో ముషీరాబాద్ పోలీసులకు దొరికిపోయాడు. 2014 ఆగస్టులో జైలు నుంచి విడుదలైన విజయసింహ వనస్థలిపురం, శంషాబాద్, కంచన్బాగ్, బేగంపేట, ఎస్ఆర్నగర్లో దొంగతనాలు చేశాడు.
ఇదీ అతని ప్రత్యేకత..
విజయసింహ ఎక్కువగా అపార్టుమెంట్లు, ధన వంతులు నివసించే ప్రాంతాల్లోనే చోరీలు చేసేవాడు. ఎలక్ట్రీషియన్ గానో, తెలుసున్న వ్యక్తులు ఉన్నారనో అపార్టుమెంట్లలోకి వెళ్తాడు. మొదటి అంతస్తులో తాళాలు వేసి ఉన్న ఫ్లాట్లను చూసుకుని వెంట తీసుకెళ్లిన ఇనుపరాడ్తో తాళం పగలగొట్టేస్తాడు. బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించిన తర్వాత తన గదికి వెళ్లిపోతాడు. ఆ మర్నాడు అన్ని పత్రికలను కొనుక్కుని చోరీకి సంబంధించిన వార్తలను చదువుతాడు. అసలు తాను దొంగిలించి వస్తువులకు, పత్రికల్లో రాసిన బంగారం విలువకు ఎక్కడెకక్కడ తేడాలున్నాయో చూసుకుంటాడు.
అలాగే పోలీసులు దర్యాప్తు ఎలా చేస్తున్నారు? డాగ్స్క్వాడ్ ఎక్కడ వరకు వెళ్లింది? తాను వెళ్లిన దారుల్లోకి వెళ్లిందా లేదా? క్లూస్ టీం ఎటువంటి నమూనాలు సేకరించింది? అన్న వివరాలను తెలుసుకుంటాడు. ఆ తర్వాతే ఆ వస్తువులను విక్రయిస్తాడు. ఏడాది కాలంగా చోరీలు చేస్తున్న విజయసింహను వనస్థలిపురం పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అతడి నుంచి ల్యాప్టాప్, 770 గ్రాముల బంగారం, 326 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.23.63 లక్షలుంటుంది.
విజయసింహపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో 200 చోరీ కేసులు ఉన్నాయి. విజయసింహ ఎన్నిసార్లు పోలీసులకు చిక్కినా లెక్క మాత్రం మరిచిపోయేవాడు కాదు. ఏ ఇంట్లో ఎంత బంగారం, ఎంత నగదు దొంగిలించాడో లెక్కలు చకచకా చెప్పేస్తాడు. విజయసింహను అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ పి.కాశీరెడ్డి, ఎస్సైలు ఎం.మహేష్, ఎస్.సురేందర్, ఎన్.ప్రకాశ్, హెడ్కానిస్టేబుల్ కె.శంకర్, కానిస్టేబుల్ ఎ.ఆనంద్కు రివార్డులు అందజేస్తామని ఓఎస్డీ నవీన్కుమార్ తెలిపారు.