విజయవాడ వరదలపై రేవంత్ రెడ్డి.. తప్పు ఎవరిది?
Vijayawada floods 2024: కనివినీ ఎరుగని విధంగా సంభవించిన విపత్తు.. రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురి చేసింది. అతి భారీ వర్షాల వల్ల ఏపీ, తెలంగాణ దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రత్యేకించి- రాజధాని అమరావతి మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

అదే తరహా పరిస్థితులు తెలంగాణలోనూ ఏర్పడ్డాయి. ప్రత్యేకించి- ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సూర్యాపేట్ జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో బుడమేరు తరహాలోనే ఖమ్మంలో మున్నేరు వాగు పొంగిపొర్లింది. ఈ నగరాన్ని ముంచెత్తింది. మున్నేరు ఉధృతికి పలు కాలనీలు జలమయం అయ్యాయి.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా గరిష్ఠంగా 28 అడుగుల ఎత్తులో మున్నేరు వాగు ప్రవహించింది. రెండో ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీని ధాటికి సగం ఖమ్మం నీట మునిగింది. ప్రకాశ్ నగర్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరం నడిబొడ్డున అయిదు అడుగుల నీరు ప్రవహిస్తోంచిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల్లో పర్యటించారు. వరద సహాయక, పునరావాస చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. 5,458 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించిందని, దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలనీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీ వరదలపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలు కవల పిల్లల్లాంటివని వ్యాఖ్యానించారు. ఈ రెండు జిల్లాల్లో ఒకేరకమైన తీవ్రతతో కూడిన వర్షం పడిందని, ఒకే రకమైన వరద ప్రభావిత పరిస్థితులు నెలకొన్నాయని గుర్తు చేశారు.
అటు ఏపీలో, ఇటు తెలంగాణలో భారీ వర్షాలు, వరదల వల్ల ఎంత మేర నష్టం జరిగిందనేది అంచనా వేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. తాము ప్రతి క్షణం అప్రమత్తతతో ఉంటూ పని చేశామని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో వరద నష్టాల గురించి అంచనా వేస్తే ఎక్కడ ఎక్కువ జరిగిందనేది తెలుస్తుందని అన్నారు.
వరదల వల్ల ఏపీలో భారీగా నష్టం జరగడం బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నష్టం జరిగినా, తాము ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ పని చేశామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉందనేది.. ఏపీలో జరిగిన వరద నష్టం గురించి అంచనా వేస్తే సరిపోతుందని అన్నారు.












Click it and Unblock the Notifications