విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు అందుకే: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు
హైదరాబాద్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు తాము మద్దతిస్తున్నామని, అవసరమైతే విశాఖకు వెళ్లి నిరసనల్లో పాల్గొంటామని వ్యాఖ్యానించిన మంత్రి కేటీఆర్పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలు దురుద్దేశంతో చేసినవేనని అన్నారు.
అందుకే కేటీఆర్ విశాఖ స్టీల్ నినాదం..
మంత్రి కేటీఆర్కు ఈ మేరకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి కోసమే మంత్రి కేటీఆర్ విశాఖ నినాదం ఇచ్చారని రేవంత్ విమర్శించారు. విభజన హామీలపై కేంద్రం పోరాటం లేదు కానీ, విశాఖ ఉక్కుపై పోరాడతారా అని ఎద్దేవా చేశారు.
గల్లీలోనే టీఆర్ఎస్ లొల్లి.. ఢిల్లీలో..?
ఎన్నికల సమయంలో హక్కుల కోసం మాట్లాడటం.. ఆ తర్వాత వాటిని మర్చిపోవడం టీఆర్ఎస్ నాయకులకు అలవాటైందన్నారు. పెరిగిన నిత్యావసరాలు, గ్యాస్, ఇంధన ధరలపై పోరాటానికి టీఆర్ఎస్ ముందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంటులో పోరాడాల్సిన టీఆర్ఎస్ ఎంపీలు మొహం చాటేశారని రేవంత్ విమర్శించారు. ప్రధాని మోడీ అంటే భయపడుతున్నారా? రాజీ పడుతున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీపై గల్లీలో మాటలకు ఢిల్లీలో చేతలకు పొంతన కుదరడం లేదని వ్యాఖ్యానించారు.
విశాఖ స్టీల్ ప్రవేటీకరణకు వ్యతిరేకమంటూ కేటీఆర్
కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బుధవారం టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఉద్యమానికి టీఆర్ఎస్ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. అవసరమైతే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సంప్రదించి విశాఖకు వెళ్లి ఉద్యమిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగా సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతోందని కేటీఆర్ ఆరోపించారు.
కేటీఆర్ ప్రకటనను స్వాగతించిన ఏపీ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తోపాటు పలు పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతోపాటు రాజకీయ పార్టీలు ఆందోళనలు చేపట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఆందోళనలకు మద్దతు పలకడంపై పలు ఏపీ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపాయి.