శంషాబాద్లో అదృశ్యమై గోవాలో తేలిన వైజాగ్ అమ్మాయి: వీడని మిస్టరీ
హైదరాబాద్: తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమైన యువతి ఆచూకీ గోవాలో లభించినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి చెందిన ఇండియన్ నేవీ ఆఫీసర్ అరవింద్ శర్మ కూతురు కైవరి శర్మ (17) ఈ నెల 14న పుణె వెళ్లేందుకు వైజాగ్ వయా శంషాబాద్ టు పుణె వెళ్లే ఇండిగో విమానం ఎక్కింది.
ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఇండిగో అధికారులతోపాటు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆమె గోవాలో ఉన్నట్టు సమాచారం అందించింది. అయితే, ఆమె ఎందుకు అదృశ్యమైందనేది ఇంకా మిస్టరీగానే ఉంది.
పూణేకు వెళ్తూ ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించకుండా పోయింది. వైజాగ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆ అమ్మాయి ఫుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్బే వైపు నడిచినట్లు పోలీసులు గుర్తించారు. నగరంలోని ఫిరోజ్గుడావద్ద ఆమె ఫోన్ చివరి సంకేతం నమోదైంది.

అయితే, ఆ అమ్మాయి అచూకీ లభ్యమైనట్లు గోవా పోలీసులు శుక్రవారంనాడు చెప్పినట్లు సమాచారం. కైవరి విశాఖపట్నంలోని ఇంటికి క్షేమంగా చేరుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అమ్మాయి గురించి తమకు ఏ విధమైన సమాచారం లేదని శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు అంటున్నారు.
ఆమె ఎక్కడికి వెళ్లింది, ఎందుకు వెళ్లిందనే విషయాన్ని మాత్రం కుటుంబ సభ్యులు వెల్లడించడం లేదని వార్తలు వచ్చాయి. ఇంటికి క్షేమంగా వచ్చిందని మాత్రమే చెబుతున్నారు.












Click it and Unblock the Notifications