మునుగోడులో అభ్యర్థులకు ఓటర్ల షాక్.. గ్రామాల్లో బ్యానర్లతో ఎటాక్, తగ్గేదేలే!!
మునుగోడు ఉప ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నాయకులకు చేదు అనుభవం ఎదురవుతుంది. ప్రజల నుంచి ఊహించని వ్యతిరేకత కనిపిస్తోంది. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని పార్టీ నేతల తీరుపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను తెరమీదికి తీసుకువచ్చి వాటిని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తాం అంటూ స్పష్టం చేయడం, ఓటర్లలో పెరిగిన చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఈ పరిణామాలు ఎన్నికల ప్రచారానికి వెళుతున్న నేతలకు ఇబ్బందికరంగా మారాయి.

మంత్రి ప్రశాంత్ రెడ్డిని నిలదీసిన ఓటర్
తాజాగా మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మీ ఊరికి రోడ్డు వేస్తామని చెప్తే, ఓటరు గట్టిగా నిలదీశారు మీ మాటలు నమ్మేది లేదంటూ తేల్చి చెప్పారు. దానికి మంత్రి నువ్వు ఆ వర్గమా? ఈ వర్గమా? అని ప్రశ్నించడంతో, నేను ఓటరుగా ప్రశ్నిస్తున్నాను అని అతను సమాధానం చెప్పాడు. మునుగోడు నియోజకవర్గంలో గ్రామాల వారీగా ఉన్న సమస్యలు పరిష్కరించకుండా డబ్బులకు ఓట్లు కొనుగోలు చేయాలన్న ఆలోచనను విరమించుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓటర్లు.

అనేక గ్రామాలలో వెలుస్తున్న బ్యానర్లు
ఇప్పటికే గతంలోనే మునుగోడు నియోజకవర్గం లోని చండూరు మండలం లోని పడమటిపాలెం గ్రామానికి చెందిన ఓటర్లు తమ గ్రామానికి రోడ్డు వెయ్యాలని కోరుతూ గ్రామ పొలిమేరలో బ్యానర్లు కట్టారు. దీంతో గ్రామస్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల నేతలు నానా తిప్పలు పడ్డారు. ఇక తాజాగా గట్టుపల్ మండలం లోని తేరట్ పల్లి గ్రామం బ్యాంకు కాలనీలో తమ కాలనీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, సిసి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు గమనిక అంటూ వారు ఒక బ్యానర్ ని ఏర్పాటు చేశారు.

తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలని బ్యానర్ లతో ఓటర్ల చైతన్యం
తమ సమస్యలు పరిష్కరించే వరకు ఎవరు తమ కాలనీ లో అడుగు పెట్టవద్దని, తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే వచ్చి ఓట్లు అడగాలని, సమస్యను త్వరగా పరిష్కరించే వారికే ఓట్లు అడగడానికి అర్హత అంటూ ఆ బ్యానర్ లో పేర్కొన్నారు. దీంతో వారి సమస్యలు పరిష్కరించడం కోసం ప్రయత్నాలు చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక తాజాగా కాశవారి గూడెం లో కూడా ప్రజలు అటువంటి బ్యానర్లు ఏర్పాటు చేశారు. మా గూడానికి రోడ్లు కావాలి.. మీరు మాకు ఇచ్చే డబ్బులు వద్దు అంటూ ఏకంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు కాశవారి గూడెం గ్రామస్తులు.

మా గ్రామాల్లో ఓట్లు అడగాలంటే సమస్యలు పరిష్కరించిన వారికే అర్హత అంటున్న ఓటర్లు
గత 30 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు మారుతున్నా మా గతుకుల రోడ్లు మారడం లేదని, కనీస సౌకర్యాలు కూడా లేవని వారు బ్యానర్ ఏర్పాటు చేసి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలకు విన్నపం మా గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించే నాయకులకే ఓట్ల కోసం వచ్చే అవకాశం అంటూ వారు బ్యానర్ లో పేర్కొన్నారు. అంతేకాదు తక్షణమే కల్వలపల్లి నుంచి కాశవారి గూడెం కు రోడ్డు వెయ్యాలని, గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించాలని వారు బ్యానర్ ద్వారా డిమాండ్ చేశారు.

ప్రచారంలో రాజకీయ పార్టీలకు తలనొప్పిగా సమస్యల ఏకరువు
ఇలా మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక చోట్ల సమస్యలను ఏకరువు పెడుతూ బ్యానర్లను ఏర్పాటు చేస్తూ, గ్రామానికి వచ్చిన ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో ప్రజలు నిలదీయటం అన్ని రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఇది ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ పై ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది.












Click it and Unblock the Notifications