హైదరాబాద్లో 14 లక్షల బోగస్ ఓట్లు, ఆధార్తో లింక్: కెసిఆర్
హైదరాబాద్: హైదరాబాదు నగరంలో 15 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు అన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సోమవారం ఎన్నికల కమిషనర్ భన్వర్లాల్ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కెసిఆర్ను కలిశారు. ఓటర్ గుర్తింపు కార్డులకు ఆధార్ లింకేజీపై చర్చించారు.
జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన కంటే ముందే ఓటర్ల జాబితా సిద్ధంచేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్లోనే ఎక్కువ బోగస్ ఓటర్లు ఉండే అవకాశం ఉందని, ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసుకోకుంటే ఓటు హక్కు ఉండదని సీఎం స్పష్టం చేశారు.
హైదరాబాద్లో బోగస్ ఓట్లు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తొలుత హైదరాబాద్లో ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం చేస్తామని, ఆ తర్వాత రాష్ట్ర మంతటా ఆధార్ అనుసంధానం కార్యక్రమం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.
బోగస్ ఓటర్లు నమోదు కావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన అన్నారు. బోగస్ ఓటర్ల ఏరివేతకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. ఆధార్ కార్డుతో ఓటరు గుర్తింపు కార్డు అనుసంధానంపై పెద్ద యెత్తున ప్రచారం చేపట్టాలని సూచించారు. ఎన్నికల సంఘం చర్యలకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు.