అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు - వారందరికీ ఆహ్వానం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో ఎంట్రీ ఇవ్వటానికి రంగం సిద్దమైంది. దసరా పండుగ నాడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించబోతున్నారు. ఇందుకు సమయం కూడా డిసైడ్ చేసారు. ఆ రోజున దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా కొత్త ప్రణాళికలు సిద్దం చేసారు. పార్టీ శాసనసభా పక్షంతో పాటుగా పార్టీ కార్యవర్గం సమావేశం కానుంది. అదే రోజున ముఖ్యమంత్రి తన జాతీయ పార్టీ కో ఆర్డినేటర్ల ప్రకటకు జాబితా సిద్దం చేసారు. అక్టోబర్ 5వ తేదీన కేసీఆర్ తన జాతీయ పార్టీ ప్రకటనకు నిర్ణయించారు.

5వ తేది మధ్నాహ్నం ముహూర్తం
దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పత్రికా ప్రకటనలు ఇవ్వాలని నిర్ణయించారు. అదే రోజు ఉదయం 11 గంటలకు పార్టీ శాసన సభా పక్షం సమావేశమై జాతీయ పార్టీ పైన తీర్మానం చేయనుంది. టీఆర్ఎస్ ఇక భారతీయ రాష్ట్ర సమితిగా మార్చేందుకు వీలుగా ఈ తీర్మానం చేయనున్నారు. ఆ వెంటనే 12 గంటలకు పార్టీ కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసారు. అందులోనూ పార్టీని జాతీయ పార్టీగా రూపారంతం చెందటానికి వీలుగా తీర్మానం ఆమోదిస్తారు. పార్టీ అధ్యక్షుడికి ఈ మేరకు అధికారం కట్టబెట్టనున్నారు. మధ్నాహ్నం 1.19 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తంగా నిర్ణయించారు. ఆ ప్రకటన సమావేశానికి జాతీయ నేతలను ముఖ్యమంత్రి ఆహ్వానిస్తున్నారు.

తరలి రానున్న జాతీయ నేతలు
కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ తో సహా ఇప్పటికే కేసీఆర్ తో కలిసి పని చేయటానికి ముందుకొచ్చిన ఇతర పార్టీల ప్రతినిధులు హాజరవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ పేరుతో పాటుగా జెండా - అజెండా ఖరారు చేసారు. అదే రోజున తన జాతీయ పార్టీ నిర్వహణకు వీలుగా జాతీయ కో ఆర్డినేటర్లను కేసీఆర్ ప్రకటించనున్నారు. పార్టీ జెండా గులాబీ రంగులో ఉంటుందని, భారతదేశ మ్యాప్ కూడా ఉండేలా రూపొందించారని సమాచారం. సంక్షేమం, సహకార సమాఖ్య ప్రధాన అంశాలుగా తమ అజెండాను కేసీఆర్ ప్రకటించనున్నారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు, రైతుబంధు, పింఛన్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు తదితర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయడంపైన కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.

తీర్మానాలు - కీలక ప్రకటన
ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉచిత విద్యుత్ పైన కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. ఇప్పుడు పార్టీ ప్రకటన సమయంలో జాతీయ సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు చెబుతూనే..తన రూట్ మ్యాప్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అనేక మంది మేధావులు..వివిధ రంగాల ప్రముఖులతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు చేసారు. వారి సలహాలు - సూచనలు స్వీకరించారు. ఇప్పుడు పార్టీ ప్రకటన సమయంలో తన విధానం వెల్లడించటంతో పాటుగా.. రాజకీయంగా తన భవిష్యత్ ప్రణాళికల పైనా క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో, కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ముహూర్తం ఖరారు కావటంతో, తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఎటువంటి సమీకరణాలు తెర మీదకు వస్తాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications