Warangal west : వరంగల్ పశ్చిమలో టఫ్ ఫైట్.. త్రిముఖ పోరులో గెలిచేది ఎవరు?
విద్యావంతులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం అయిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుండి నాయిని రాజేందర్ రెడ్డి, బిజెపి నుండి రావు పద్మా రెడ్డి ఎన్నికల బరిలోకి దిగి ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు.
వరంగల్ మహానగరంలో భాగంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలు సంతృప్తి చెంది తనను గెలిపిస్తారని బిఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మద్దతు కెసిఆర్ కి ఉంటుందని ఆయన చెబుతున్నారు.

ఇలా ఉంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, కెసిఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని, దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబం వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని దోచుకు తింటున్నారని, వచ్చే ఎన్నికలలో ప్రజలు కచ్చితంగా బిజెపికే అండగా నిలుస్తారని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రావు పద్మా రెడ్డి.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో బి ఆర్ ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి. దాస్యం వినయ్ భాస్కర్ నియోజకవర్గంలో భూకబ్జాలకు పాల్పడ్డారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జాల చెరలో ఉన్న ప్రతి భూమిని కాపాడుతామని చెబుతున్నారు.
ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో, వాడ వాడలా తిరుగుతూ ప్రజలను తమకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ప్రజలు ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఇప్పటికే దాస్యం వినయ్ భాస్కర్ కు అవకాశం ఇచ్చారు. మొత్తంగా నాలుగుసార్లు వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ దఫా ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఆసక్తికరమే. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కొనసాగుతున్న వేళ ఎన్నికల వరకు పరిణామాలు ఏ విధంగా మారుతాయి అన్నది సర్వత్ర ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications